కూరగాయల్లో బోలెడు పోషకాలున్నాయి. అలాగో కోడిగుడ్డును రోజూ ఒకటి తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి కాంబినేషన్లో వెజిటబుల్ ఎగ్ పులావ్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం..
కావలసిన పదార్థాలు:
కోడి గుడ్లు: 10
బియ్యం: ఒకటిన్నర కేజీ
ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు
కరివేపాకు: రెండు టీ స్పూన్లు
కొత్తిమీర: ఒక కట్ట
గరం మసాలా: రెండు టేబుల్ స్పూన్లు
నూనె: సరిపడా
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
కారం: రెండు టేబుల్ స్పూన్లు
పసుపు: చిటికెడు
లవంగాలు: 6
దాల్చిన చెక్కలు: 6
మీకు నచ్చిన మిక్స్డ్ వెజిటేబుల్స్: రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి ముద్ద: పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు : మూడు టీ స్పూన్లు
ఎండుమిర్చి తరుగు: నాలుగు టీ స్పూన్లు
ఉప్పు: తగినంత,
తయారీ విధానం :
ముందుగా కోడిగుడ్లను దోరగా వేగినట్లు అట్టుపోసి పక్కనబెట్టుకోవాలి. మరో నాలుగు కోడిగుడ్లను ఉడికించుకోవాలి. బియ్యాన్ని కడిగిపెట్టేసుకోవాలి. స్టౌ మీద పాన్ను పెట్టి వేడయ్యాక నూనె పోయాలి.
నూనె బాగా కాగాక కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపాలి. తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా గరంమసాలా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కోడిగుడ్డు అట్టు ముక్కలు వేసి వేపుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా అయ్యేవరకూ ఉడికించి దించేయాలి.
స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోయాలి. బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
ఇవి వేగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి గరిటతో కలపాలి. ఇందులో గరంమసాలా, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కాసేపు బియ్యాన్ని వేగించుకోవాలి.
ఇందులో కోడిగుడ్డు ముక్కల కూర వేసి బాగా కలపాలి. వెజిటబుల్స్ ముక్కలు కూడా చేర్చి ఒక లీటరు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చివర్లో నెయ్యివేసి ఉడికించి పెట్టుకున్న గుడ్లను ముక్కలుగా కోసి పలావుపైన గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ..