అక్షయ తృతీయ... లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయాలి!?

గురువారం, 1 మే 2014 (18:54 IST)
WD
అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కుబేర లక్ష్మీ పూజ చేయాలని పండితులు అంటున్నారు. కాబట్టి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి పూజామందిరమును శుభ్రపరచి, దేవుని పటాలకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి.

ఆ తర్వాత దీపాలను కూడా పసుపు, కుంకుమలు, పువ్వులతో అలంకరించుకుని దీపాలు వెలిగించుకోవాలి. పూజామందిరాన్ని అందంగా రంగవల్లికలతో తీర్చిదిద్దుకోవాలి. అనంతరం రంగవల్లికపై ఓ పీటను ఏర్పాటు చేసి దాని కింద పసుపు, బియ్యం, నాణేలు పెట్టాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందు అరటి ఆకును వేసి బియ్యాన్ని వేసి దానిపై వెలిగించిన దీపాన్ని ఉంచాలి. పసుపులో వినాయకుడిని చేసి.. దానికి కుంకుమ, పువ్వులు పెట్టుకోవాలి.

కొత్త వస్త్రాలు, బంగారం వుంటే కలశానికి ముందు పెట్టాలి. చక్కెర పొంగలి, పాలతో పాయసం నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలా పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి.

అక్షయ తృతీయ నాడు (మే 2) మనం చేసే దానాలు మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభించడంతో పాటు సత్ఫలితాలు చేకూరుతాయి. ఇంకా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి పటానికి ముందు నేతి దీపమెలిగించి లక్ష్మీస్తుతి చేయడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి