హనుమజ్జయంతి ఎప్పుడు జరుపుకోవాలి? ఆంజనేయ స్తోత్రాలను స్తుతిస్తే?

బుధవారం, 9 మే 2018 (17:42 IST)
హనుమజ్జయంతి చైత్రంలోనా, వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. 
 
అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. 
 
అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. 
 
ఈ రోజున ఉయ్యూరులోని సువర్చలా సహిత ఆంజనేయ స్వామికి వైభవంగా వివాహ మహోత్సవం జరుగుతుంది. ఇంకా హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే 
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమినాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు