ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ పోలింగ్ : 424 స్థానాల్లో పోలింగ్ పూర్తి

మంగళవారం, 7 మే 2019 (09:46 IST)
దేశంలో సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, ఇప్పటివరకు ఐదు దశల పోలింగ్ జరిగింది. ఇందులో దేశ వ్యాప్తంగా మొత్తం 542 లోక్‌సభ స్థానాలకుగాను ఇప్పటివరకూ 424 స్థానాలలో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక మిగిలిన 118 స్థానాలకు చివరి రెండు దశల పోలింగ్ ఈ నెల 12, 19 తేదీలలో ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 
 
మరోవైపు, సోమవారం ఐదో దశ పోలింగ్ జరిగింది. పలు చోట్ల పేలుళ్లు, హింసాత్మక ఘటనల నడుమ ఇది ప్రశాంతంగా ముగిసింది. అత్యంత ప్రముఖులు బరిలో ఉన్న ఐదో దశలో మొత్తం మీద 62.87 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. దీనితో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పోలింగ్‌లోనే అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ మరోమారు తమ బల నిరూపణకు రంగంలో నిలిచారు.
 
అలాగే, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ దశ పోలింగ్‌లో భవితను తేల్చుకోనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 14 స్థానాలకు పోలింగ్ జరిగింది. 2.47 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 58 శాతానికి పైగా ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్‌లో 12 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం మీద 64 శాతం ఓటింగ్ జరిగింది. 
 
మధ్యప్రదేశ్‌లో ఏడు స్థానాలకు, బీహార్‌లో ఐదు, జార్ఖండ్‌లో నాలుగు స్థానాలకు పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 75 శాతం వరకూ ఓటింగ్ జరిగింది. ఇక్కడ పలు ప్రాంతాల్లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. బాంబులు విసురుకోవడం, దాడులకు దిగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని లడక్‌లో అత్యధికంగా 64 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
జమ్మూ కాశ్మీర్‌లోని ఉద్రిక్త స్థలి పుల్వామాలో పోలింగ్ కేంద్రాలలో పేలుళ్లు జరిగాయి. ఓటర్లను భయభ్రాంతులను చేసేందుకు ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనితో సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో తొలిసారిగా ఉగ్ర సంబంధిత పేలుళ్లు చోటుచేసున్నట్లు అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు