యూరిన్ టెస్టుతో క్షయవ్యాధి నిర్ధారణ

సంప్రదాయ పరీక్షల కంటే సులభంగా చేయగలిగే మూత్ర పరీక్ష ద్వారా ఇక మీదట క్షయ వ్యాధిని నిర్ధారించవచ్చునని...ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఫలితాలు సంప్రదాయ పరీక్షల కంటే మరింత మెరుగ్గా ఉంటాయని, దీని వల్ల వ్యాధి నిర్ధారణా రేటు బాగా మెరుగవుతుందని వారంటున్నారు.

ఈ విషయమై ఎయిమ్స్ ప్రయోగశాల విభాగానికి చెందిన డాక్టర్ శర్మన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... క్షయ వ్యాధి నిర్ధారణకు మూత్రంలోని పీసీఆర్, కల్చర్ పరీక్షలు చేయడం చాలా సులభమని తెలిపారు. ఇంతకుమునుపయితే గల్ల పరీక్షించటం ద్వారానే క్షయను నిర్ధారించేవారనీ, ఈ గల్లను సేకరించేందుకు బోలెడు సమయం, మానవ వనరులు కూడా వృధా అయ్యేవని, మూత్ర పరీక్షలకు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే... శర్మన్ సింగ్ బృందం క్షయ వ్యాధిని నిర్ధారించేందుకుగానూ, 81 మందిని పరిశీలించి.. వారికి గల్ల, మూత్ర పరీక్షలను జరిపింది. అయితే గల్ల పరీక్షల్లో క్షయ లేదని తేలినా, మూత్ర పరీక్షల్లో మాత్రం వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో క్షయవ్యాధిని త్వరగా నిర్ధారించేందుకు మాత్రపరీక్షలే మెరుగైనవిగా ఎయిమ్స్ బృందం తేల్చి చెప్పింది.

వెబ్దునియా పై చదవండి