రాత్రిపూట మూత్ర విసర్జనతో ఆరోగ్యానికి ముప్పు

రాత్రుల్లో నిద్ర లేచి కనీసం రెండుసార్లు మూత్ర విసర్జనకు వెళ్లే వృద్ధులు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలనీ, లేకపోతే ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతారని అమెరికన్ పరిశోధకులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఒకే ప్రాంతంలో నివసిస్తుండే 70 ఏళ్లు పైబడిన వృద్ధులను పరిశీలించిన అనంతరం తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. ముందుగా... వృద్ధులలో ఎవరికి రాత్రిపూట మూత్ర విసర్జన చేయాల్సి వస్తోందో, మూడు సంవత్సరాల పాటు పరిశీలించి, ఆ కాలంలో మరణించిన వారి వివరాలను సేకరించినట్లు వారు వివరించారు.

నేషనల్ హెల్త్ సిస్టంలోని వివరాల ఆధారంగా... వృద్ధులకు ఉన్న వ్యాధులను అడిగి తెలుసుకున్నామనీ, ఆ తరువాత వారి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, మధుమేహం, హైపర్ టెన్షన్, హృద్రోగ చరిత్ర, నెఫ్రోపతి, మద్యపానం అలవాటు, టాంక్విలైజర్ల వినియోగం లాంటి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ సేకరించి మూడేళ్ల తమ పరిశీలనలను పోల్చి చూసి పై నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు వివరించారు.

ఈ మేరకు అమెరికన్ యూరాలాజికల్ అసోసియేషన్ ప్రతినిధి ఆంథోనీ స్మిత్ మాట్లాడుతూ... రాత్రిపూట రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసే వారికి, తీవ్రమైన శారీరక సమస్య ఏదో ఒకటి ఉన్నట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు. కాబట్టి.... ఇలాంటి సమస్య ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తమ వ్యాధి ఏంటో తెలుసుకుని తగిన చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందని స్మిత్ హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి