గుడ్లగూబల్లా మేల్కొనే టీనేజర్స్‌కి ఆ సమస్య తప్పదు..

బుధవారం, 18 సెప్టెంబరు 2019 (17:48 IST)
అమ్మాయిలు రాత్రి నిద్రపోకుండా గుడ్లగూబల్లా మేలుకుంటున్నారా.. అయితే ఒబిసిటీ తప్పదని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ముఖ్యంగా టీనేజీలో వున్నవారైతే.. ఒబిసిటీ ప్రభావం మరీ ఎక్కువగా వుంటుందని తాజా అధ్యయనంలో తేలినట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. 
 
తాజాగా పరిశోధన ప్రకారం.. రాత్రి పూట అధిక సమయం మేల్కొనే టీనేజీ అమ్మాయిలు బరువు పెరిగే ప్రమాదం పొంచి వున్నట్లు కనుగొన్నారు. ఇందులో భాగంగా రాత్రిపూట మేల్కొనే యువతులపై జరిపిన పరిశోధనలో.. నిద్రపోకుండా అదే పనిగా కంప్యూటర్లు, ఫోన్లతో కాలం గడిపే అమ్మాయిల్లో బరువు పెరిగిందని, హాయిగా నిద్రించే యువతుల్లో బరువు పెరిగే సమస్య లేదని వెల్లడయ్యింది. 
 
ఈ కథనం జర్నల్ జమా పీడియాట్రిక్స్‌లో ప్రచురితమైంది. అంతేగాకుండా ఈ పరిశోధనలో 418 మంది అమ్మాయిలు, 386 మంది అబ్బాయిలపై జరిగింది. వీరు 11 నుంచి 16 ఏళ్ల లోపు వారే. నిద్రపోయే గంటలు, నిద్రించే సమయం, రాత్రిళ్లు ఎన్నిగంటలు నిద్రపోతున్నారు, వారాంతాల్లో ఎంతసేపు నిద్రపోతున్నారనే వివిధ అంశాలపై పరిశోధన జరిగింది. ఇలా రాత్రి పూట అత్యధిక సమయం నిద్రపోకుండా వుండేవారిలో అధిక బరువు సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు గమనించారు.  
 
రాత్రిపూట నిద్రపోని వారిలో కొవ్వు శాతం పెరిగిందని, తద్వారా పొట్టపెరగడం, బరువు పెరగడం వంటివి బయటపడినట్లు పరిశోధకులు తెలిపారు. కానీ హాయిగా రాత్రిపూట 8 గంటలు నిద్రపోయే వారిలో ఈ సమస్య లేదని వెల్లడించారు. కనుక టీనేజీ యువత రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్లు, కంప్యూటర్ల ముందు గడపటం కంటే హాయిగా నిద్రపోవడం ద్వారానే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని అమెరికా పరిశోధకులు సూచిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు