ఆరోగ్యకరమని పితికిన పాలు కొంటున్నారా? అయితే బాగా మరిగించి వాడండి..

సోమవారం, 23 అక్టోబరు 2017 (15:02 IST)
ఆరోగ్యకరమని పితికిన పాలు కొంటున్నారా...? వాటిని  కాసేపు మరిగించాక దించేస్తున్నారా? అయితే జాగ్రత్తపడండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పటికప్పుడే పితికిన పాలు కొంటే.. అందులో ఉండే వ్యాధి కారక బ్యాక్టీరియాను చంపేందుకు తప్పనిసరిగా వాటిని 80-90 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మరిగించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ పాలను వేడి వద్ద ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించి.. ఆపై తాగడమే మంచిది. అలాగే ప్యాకెట్ పాలను కూడా బాగా మరిగించి ఉపయోగించాలి. రైతులు గేదెల నుంచి పాల సేకరణ విషయంలో పరిశుభ్రత పాటించడం చాలా తక్కువగా ఉంది. దాంతో పాలలో హానికారక బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉంటోంది. అందుకే ఈ పాలను బాగా మరిగించాలి. బాగా వేడి చేయనట్లైతే బ్యాక్టీరియాతో అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక పాలను ఓ సారి కాచి మరిగించుకోవడం మంచిది. 
 
అలాగే ప్యాకెట్ దెబ్బతింటే పాలలోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశాలున్నాయి. అలాగే, పైగా డైరీ ప్లాంట్లలో పాశ్చురైజేషన్ ఎంత సమర్థవంతంగా చేస్తున్నారో తెలియదు. ఈ ప్రక్రియ తర్వాత కూడా కొంత మేర బ్యాక్టీరియా మిగిలి ఉండడానికి అవకాశాలున్నాయి. అందుకే ఏ పాలను కొన్నా బాగా మరిగించి ఉపయోగించడం మంచిది. కానీ టెట్రా ప్యాక్‌లలో వచ్చే యూటీహెచ్‌టీ పాలను మాత్రం ఎక్కువ సేపు మరిగించాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.  
 
పాశ్చురైజ్డ్ పాలును 90 డిగ్రీల వద్ద ఐదు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాటిని సహజసిద్ధంగా వేడి తగ్గనివ్వాలి. దీనివల్ల పాలలో పోషకాలు అలానే వుంటాయి. పాలను అలా బయట పెట్టకుండా ఫ్రిజ్‌లో ఉంచాలి. బయటే ఉంచేస్తే తిరిగి పాలు చల్లబడిన తర్వాత అందులోకి బ్యాక్టీరియా చేరేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ బయటే ఉంచేస్తే వాడుకునే ముందు రెండు నిమిషాల పాటు కాచి వాడుకోవాలి. మైక్రోవేవ్ ఓవెన్‌లో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పాలను వేడి చేసి వాడుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు