మైదా ఎక్కువ తింటే... ఆరోగ్యం గోవిందా!

బుధవారం, 6 జులై 2016 (13:59 IST)
మ‌న వంట‌కాల్లో ముఖ్యంగా చిరుతిండిలో మైదా ఎక్కువ‌గా వాడ‌తారు. కారం, తీపి చిప్స్, పుల్కా, చ‌పాతీ, ఇలా చాలా స్నాక్స్‌లో మైదా వాడేస్తుంటారు. కానీ, ఈ మైదా అతిగా తింటే ఆరోగ్యం సంగ‌తి అంతే అంటున్నారు ఆరోగ్య‌వేత్త‌లు. అస‌లు మైదా ఎక్క‌డి నుంచి వ‌స్తుంది?  మామూలుగా ఆలోచిస్తే, గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది. కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? మైదా పిండి ఎలా వస్తుంది... అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక్కసారి చ‌ద‌వండి.
 
మిల్లులో బాగా పాలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి అజోడికార్బోన‌మైడ్, క్లోరిన్ గ్యాస్, బెన్జోయ‌ల్ పెరాక్సైడ్ అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. అదే మ‌నం వాడే మైదాపిండి. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడ‌కాన్ని చైనా, ఐరోపా దేశాల్లో నిషేధించారు. మైదాలో అల్లాక్స‌న్ అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
 
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలా కార్యాలయాల్లో కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు. మైదా పిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు. దీనివ‌ల్ల మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు చాలానే ఉన్నాయి. మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు క‌లుగుతాయ‌ని డాక్ట‌ర్లు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి