కదలకుండా కూర్చొని పని చేస్తున్నారా... అయితే, మీ ఆయుష్షు...

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (10:40 IST)
ప్రతి మనిషి జీవితం యాంత్రికంగా మారిపోయింది. కొందరు ఉరుకులు పరుగులతో జీవితం కొనసాగిస్తుంటే, మరికొందరు కూర్చొన్న చోటే అటూఇటూ కదలకుండా పనిచేస్తున్నారు. ఇలాంటి వారే ఎక్కువ అనారోగ్య సమస్యల బారినపడుతున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఒకేచోట.. కదలకుండా పని చేసేవారు అనారోగ్యం బారినపడటమే కాకుండా వారి ఆయుష్షు కూడా బాగా తగ్గినట్టు సర్వేలు హెచ్చరిస్తున్నాయి.
 
అయితే, ఎక్కువ కూర్చుంటే కలిగే అనర్ధాలు ఏముంటాయిలే అనుకోకండి. గంటల తరబడి కుర్చీలకు పరిమితమైతే మధుమేహం, గుండె సంబంధిత రోగాల బారిన పడాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది కూర్చొని పనిచేస్తుండటంతో శారీరక శ్రమ తగ్గి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నట్టు  పలు అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 
 
ఇటీవల కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో జరిపిన ఒక అధ్యయనంలో 45 ఏళ్లు, ఆపై వయసున్నవారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కదలకుండా కూర్చొని పనిచేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని... జీవన ప్రమాణం తగ్గుతోందని చెప్పారు. ఎక్కువసేపు టీవీ చూడటం, కదలకుండా కూర్చుని కంప్యూటర్ల ముందు పనిచేసేవారే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
 
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందిలో శరీరక శ్రమ తక్కువైందని, నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే రన్నింగ్, వాకింగ్ తప్పనిసరి అని సర్వేలు చెబుతున్నాయి. వ్యాయామం వల్ల శరీరంలోని అన్ని కండరాలకు సరైన రక్తప్రసరణ జరిగి ఉత్సాహంగా ఉండొచ్చనేది నిపుణులు అభిప్రాయం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు