తులసి ఆకులతో పుదీనా ఆకులను కలిపి నమిలితే...

గురువారం, 8 జులై 2021 (19:35 IST)
ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం, ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.
 
ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలా చేసుకుని ఉదయం, సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
 
కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు వేడినీటిలో కలుపుకుని తాగడం వలన ఉదర భాగంలో ఏర్పడే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. 
 
బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబందిత వికారాలు తగ్గిపోతాయి.
 
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు.
 
పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసీ మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత వ్యాధులు తగ్గుముఖం పడతాయి. వీటితో పాటు చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుముఖం పడతాయి.

వెబ్దునియా పై చదవండి