తిరుమలలో నో రాయల్టీ ఎమ్‌ఆర్‌పి ధరలకే విక్రయాలు

సోమవారం, 23 ఫిబ్రవరి 2015 (21:41 IST)
తిరుమలలో ఇంతకాలం భక్తులను వ్యాపారులు నిలువుదోపిడీ చేసేవారు. అధికధరలతో తమ ఇష్టం వచ్చినట్లు విక్రయాలు జరిపేవారు. ఈ పాపంలో కొంత టీటీడీకి కూడా భాగం ఉండేది. అయితే సిఎం చంద్రబాబు చొరవతో అధిక ధరలకు చెక్ పడినట్లైంది. వివరాలిలా ఉన్నాయి. తిరుమలలో భక్తులకు విక్రయించే అన్ని రకాల వస్తువుల పై రాయల్టీ విధించే వారు. ఇక రవాణా చార్జీలు పేరుతో కొంత టీటీడీ రాయల్టీ పేరుతో మరికొంత ధర విధించి వ్యాపారులు భక్తులకు గుండు కొట్టే కార్యక్రమాన్ని యథేచ్చగా చేసేవారు. అయితే ఇటీవల చంద్రబాబు తిరుమల రాక సందర్భంగా విలేకరులు టీటీడీ రాయల్టీ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. 
 
దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. తిరుమల వచ్చే భక్తులపై ఏమాత్రం భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో టిటిడి ఇఓ సాంబశివరావు అధికారులతో చర్చించారు. ఇక పై తిరుమలలో నిర్ణీత ఎమ్‌ఆర్‌పి ధరలకే దుకాణదారులు వస్తువుల విక్రయాలు సాగించేలా పర్యవేక్షించాలని ఆయన టిటిడి అధికారులకు సూచించారు. 
 
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం టిటిడి ఎస్టేట్‌ విభాగం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇఓ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా తిరుమలలో భక్తులకు విక్రయించే అన్ని రకాల వస్తువుల పై టిటిడి విధిస్తున్న రాయల్టిdని రద్దు చేయాలని టిటిడికి అనేక వినతులు అందాయి. దీనిపై ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దుకాణదారులు ఎంఆర్‌ పి ధరలకే వస్తువులు విక్రయించేలా చర్యలు చేపట్టాలని టిటిడి ఎస్టేట్‌, విజిలెన్స్‌ విభాగాల అధికారులను ఇఓ ఆదేశించారు.
 

వెబ్దునియా పై చదవండి