పుష్కరాలలో తొక్కిసలాట.. పలువురు భక్తుల మృతి

మంగళవారం, 14 జులై 2015 (10:52 IST)
పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజే అపశృతి చోటుచేసుకోవడం అక్కడే ఉన్న భక్తులను, ఆ సన్నివేశాలను తిలకిస్తున్న సామాన్య జనాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. రాజమండ్రిలో పుష్కరాలు ఉదయం 6.21గంటలకు ప్రారంభంకాగా రెండు గంటల వ్యవధిలోనే తొక్కిసలాట చోటుచేసుకొని ముగ్గురు చనిపోవడంతో తీవ్ర కలవరం నెలకొంది. అయితే చనిపోయిన వారి సంఖ్య పది వరకూ ఉండవచ్చునని తెలుస్తోంది. 
 
పుష్కర ఘాట్ మొదటి ద్వారం కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్దకు ఒక్కసారిగా భక్తులు చొచ్చుకు రావడంతో తొక్కిసలాట నెలకొని పదిమంది చనిపోయారు. పలువురు గాయాలపాలయ్యార. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఏయే పుష్కర ఘాట్కు ఎంతమంది భక్తులు వస్తారు, వారి ప్రవేశం కోసం ఎలాంటి ప్రవేశ ద్వారాలు ఏర్పాటుచేయాలని, రాకపోకలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే ముందస్తు వ్యూహం కూడా పుష్కరాల నిర్వాహక అధికారుల వద్ద లేనట్లు తెలుస్తోంది. అపశృతి చోటుచేసుకున్న కోటగుమ్మం పుష్కర ఘాట్కు వెళ్లేందుకు వచ్చేందుకు ఒకే మార్గం ఉండటం కూడా ఓ రకంగా తొక్కిసలాటకు కారణమైందని చెబుతున్నారు. 
 
తొలిరోజు పుష్కరాలు కావడంతో ఊహించని విధంగా వేలల్లో భక్తులు గోదావరి తీరం వెంట పోటెత్తారు. ఓ పక్క, పుణ్యస్నానాలకు నదిలోకి దిగిన వారు రాకముందే అప్పటికే ఎదురు చూస్తున్నవారు నెట్టుకొని ముందుకురావడంతో ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలతో వృద్ధులు, మహిళలు చిన్నపిల్లలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి