ముంబైలోని వాఖండే స్టేడియంలో భారత్-శ్రీలంకల మధ్య కీలక ఫైనల్ సమరం ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. యావత్తు క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫైనల్ సమరం మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. పటిష్టమైన టీమిండియాను పడగొట్టేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తామని టాస్ గెలిచిన సందర్భంగా కెప్టెన్ సంగక్కర అన్నాడు.
మాథ్యూస్ గాయంతో తప్పుకున్నప్పటికీ టీమిండియాపై మెరుగ్గా ఆడుతామని చెప్పాడు. కాగా శ్రీలంకలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. అజంతా మెండీస్, మాథ్యూస్, హెరాథ్ స్థానాల్లో కులశేఖర, రణదివ్, పెరెరాలను జట్టులోకి తీసుకున్నారు. టీమిండియా జట్టులో మాత్రం ఆశిష్ నెహ్రా స్థానంలో శ్రీశాంత్ను జట్టులోకి తీసుకున్నారు.
ఇకపోతే.. టీమిండియా కూడా శ్రీలంకను మట్టికరిపించి కప్ గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు భారత్ కప్ గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో, టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వందో శతకం సాధించాలని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ శనివారమంతా వ్రతమాచరిస్తున్నారు.