60 ఏళ్లంటే మన దేశంలో షష్టిపూర్తి వేడుకలు జరుపుకుంటారు. అయితే భరతమాత మాత్రం ఈ 60ఏళ్లలో అత్యంత శక్తివంతమైన యువ శక్తిని దేశానికి అందించింది. తెల్లదొరల పాలనా పగ్గాలను తమ చేతిలోకి తీసుకున్న తర్వాత మన దేశం దాదాపు అన్ని రంగాలలోను అభివృద్ధిని సాధిస్తూ ముందడుగు వేస్తోంది. పొరుగుదేశాలతో జరిపిన యుద్ధాలలో చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకున్నది. పోఖ్రాన్ వంటి అణు పరీక్షలు జరిపి అణుశక్తి సామర్థ్యం కలిగిన అగ్రరాజ్యాల సరసన స్థానం సంపాదించుకుంది.
భారత దేశానికున్న బలాలు ఇటువంటివైతే మరికొన్ని సవాళ్లు భారత్ను పట్టి పీడిస్తున్నాయి. వాటిలో తీవ్రవాదం ప్రధానమైనది. దేశంలో ఏదో ఒక మూలన తీవ్రవాద కార్యకలాపాల వల్ల అమాయక ప్రజలు బలైపోతూనే ఉన్నారు. భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. వీటన్నిటినీ భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. తిప్పికొడుతూ తన ఆధిపత్యాన్ని చాటుతోంది.
అయితే స్వాతంత్ర్య సమరానికి ముందు వెనుక ఎన్నో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. బాపూజి వంటి పలువురు త్యాగమూర్తులను కోల్పోయిన భరతమాత ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. గతకాల చక్రంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘటనలు మీ కోసం....
* 1600లో ఈస్ట్ ఇండియా కంపెని స్థాపనతో బ్రిటిష్వారి రాక * 1757లో జరిగిన ప్లాసీ యుద్దంలో బ్రిటిష్వారు బెంగాలును ఆక్రమించుకున్నారు. * 1836లో మొట్టమొదటిసాగిగా వందేమాతర గీతాన్ని బకించంద్ర ఛటర్జీ ఆలపించారు. * 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొనే `సిపాయిల తిరుబాటు` జరిగింది. * 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రస్ ఏర్పడింది. * 1901లో శాంతినికేతన్ని స్థాపించారు. * 1902లో అనుశీలన్ సమితిని కలకత్తాలో ప్రమంత్ మత్ మిత్ర స్థాపించారు. * 1905లో బెంగాల్ విభజన జరిగింది. * 1906లో ఆల్ ఇండియా ముస్లింలీగ్ని స్థాపించారు. * 1907లో కాంగ్రెస్ పార్టీ అతి వాదులు, మిత వాదులు అనే రెండు వర్గాలుగా చీలిపోయింది.
* 1914లో జరిగిన మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్ తరుపున పది లక్షల మందికిపైగా సైనికులు పాల్గొన్నారు. * 1915వ సంవత్సరం నుండి గాంధీ భారత స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. * 1916లో హోమ్ రూల్ ఉద్యమాన్ని అనిబిసేంట్ ప్రారంభించారు. * 1916లో పింగళి వెంకయ్య తయారుచేసిన త్రివర్ణ పతాకాన్ని లక్నో సమావేశంలో ఎగురవేశారు. * 1919 ఏప్రిల్లో జలియన్వాలాబాగ్ ఉదంతం జరిగింది. * 1919లో రౌలత్ చట్టాన్ని విధించారు. * 1919లో కిలాఫత్ ఉద్యమం * 1920లో జవహర్ లాల్ నెహ్రు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్కు అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. * 1921లో అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీని స్థాపించారు. * 1921లో రవీంద్రనాధ్ ఠాగూర్ విశ్వభారతిని స్థాపించారు.
* 1922లో చౌరీ చౌరా సంఘటన జరిగింది. * 1924లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని కాన్పూర్లో స్థాపించారు. * 1928లో సైమన్ కమిషన్ ఇండియా వచ్చింది. * 1930 జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్ డిక్లేరేషన్ని కాంగ్రెస్ ఆమోదించింది. * 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. * 1931లో ఇర్విన్ ఒడంబడిక జరిగింది. * 1931లో భగత్ సింగ్ని ఉరితీశారు. * 1932లో పూనా ఒడంబడిక జరిగింది. * 1932లో రెండవ రౌండ్ టెబుల్ సమావేశం జరిగింది. * 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
* 1934లో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. * 1936లో నెహ్రు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. * 1942లో క్విట్ఇండియా ఉద్యమం జరిగింది. * 1942లో సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు.
స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత...
WD Photo
WD
* 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. * 1947లో అఖండ భారతావని భారత్, పాకిస్థాన్గా విడిపోయిన చేదు ఘటనలో దాదాపు 20లక్షల మంది హతమయ్యారు. * 1947లో అక్టోబర్ 27న కాశ్మీర్ రాజు హరిసింగ్, గవర్నర్ జనరల్ మౌంట్బాటన్ భారత్లో కాశ్మీర్ విలీన ఒప్పందంపై సంతకాలు చేశారు. * 1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రపంచానికి అహింసా పాఠాన్ని బోధించిన జాతిపిత మహాత్మాగాంధి గాడ్సే తుపాకీ తూటాలకు నేలకొరిగారు. * 1948 సెప్టంబర్ 17న నేటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత్లో అంతర్భాగమైన రోజు. * 1949.. నవంబర్ 26న డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ బీఆర్. అంబేద్కర్ సమర్పణతో ప్రపంచ సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు. * 1950.. జనవరి 24న రవీంద్రనాథ్ ఠాగూర్ రాసి, స్వరపరిచిన "జనగణమన" జాతీయగీతం ఆమోదం పొందిన రోజు. * 1950.. జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన రోజు. * 1951.. తొలి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన సంవత్సరం. * 1952.. తొలిసారిగా సాధారణ ఎన్నికలకు భారత దేశం సిద్ధమైన ఏడాది. 1951 అక్టోబర్ నెలలో ప్రారంభమై, 1952 ఫిబ్రవరిలో ముగిసిన ఈ ఎన్నికల్లో 74 పార్టీలు పోటీచేశాయి.
* 1952... తిరగేసిన ఎర్ర త్రికోణం గుర్తుతో కుటుంబ నియంత్రణ ప్రారంభమైన సంవత్సరం. * 1952.. డిసెంబర్ 16న ఆంధ్రరాష్ట్రావతారణ కోసం ఆమరణ నిరాహారదీక్షను చేపట్టిన పొట్టి శ్రీరాములు మరణించిన రోజు. * 1962లో చైనాతో యుద్ధం జరిగింది. * 1971లో బంగ్లాదేశ్ విముక్తికై పాక్తో భారత్ యుద్ధం చేసి విజయం సాధించింది. * 1974లో జరిపిన పోఖ్రాన్ అణు పరీక్షలు భారత్ను అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశంగా నిలబెట్టింది. * 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. * 1999లో ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్తో యుద్ధం జరిగింది. * 1994లో జరిగిన అందాల పోటీలలో సుస్మితా సేన్ విశ్వసుందరిగా ఎంపికైంది. * 2000 సంవత్సరంలో భారతదేశ జనాభా వందకోట్లకు చేరుకుంది. * 2007లో తొలిసారిగా ఓ మహిళ(ప్రతిభా పాటిల్) రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించారు.
ప్రముఖుల నినాదాలు: * 'స్వాతంత్ర్యం నా జన్మహక్కు' అని బాలగంగాధర్ తిలక్ ఉద్ఘాటించారు. * 'జైజవాన్ జైకిసాన్' అని లాల్ బహుదూర్ శాస్త్రి ఎలుగెత్తి చాటారు. * 'ఇంక్విలాప్ జిందాబాద్' అని భగత్ సింగ్ అన్నారు. * దమ్ముంటే కాల్చండి అని తెల్లవాళ్ళపై ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సవాల్ విసిరారు. * వేదాలలోకి తరలిపొండి అని దయానంద సరస్వతి అన్నారు. * క్విట్ ఇండియా అని మహాత్మా గాంధీ జన సంద్రంతో తెల్లదొరలపై అహింసా వాదంతో విరుచుకుపడ్డారు.