ఆంగ్లేయుల పాలనా సంకెళ్ళ నుంచి భరతమాతను విడిపించేందుకు అహింసా మార్గంలో ఉద్యమాలు చేపట్టిన మహా నేత, స్ఫూర్తి ప్రదాత మన జాతిపిత మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో మోహన్ దాస్.. పుతిలీభాయ్ దంపతులకు 1869 అక్టోబరు రెండో తేదీన జన్మించారు. 1948 జనవరి 30వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో హిందూ ఉన్మాది నాధూరాం గాడ్సే తుపాకీ గుళ్ళకు ప్రాణాలు విడిచారు.
భారతదేశ స్వాతంత్ర్యం కోసం 'జై హింద్' అనే నినాదంతో జాతి యావత్తును ఒక్కతాటిపైకి తెచ్చిన మహనీయుడు బాపూజీ. తాను చేపట్టిన ఉద్యమాలు, శాంతి మార్గాలపై తెల్లదొరలు తమ ఉక్కుపాదాలు మోపినా.. వెన్నుచూపకుండా.. పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. మహాత్మాగాంధిజీ చేపట్టిన అహింసామార్గాన్ని చూసి నాటి బ్రిటిష్ ప్రభుత్వం జడిసింది.
అహింసా పద్ధతిలో గాంధీజీ చేపట్టిన ప్రతి ఉద్యమం భారతీయ ప్రజల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. స్వాతంత్ర్య పోరాటంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడానికి గాంధీవాదమే ప్రజలకు ఊపిరి పోసింది. తన ఆరోగ్యం క్షీణదశకు చేరుకున్నా గాంధీజీ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష తెల్లదొరల పరిపాలనకు తెరదించినట్లైంది. అంతేకాకుండా దేశంలోని మతవ్యవస్థలకు కూడా ఫుల్స్టాప్ పెట్టినట్లైంది.
భారతదేశం-పాకిస్థాన్ వేర్వేరు దేశాలని పేర్కొన్న సమయంలో ఏర్పడిన అల్లర్లను పోలీసులు, సైనికులు ఆపలేకపోయారు. అయితే మహాత్మాగాంధీ నిరాహారదీక్ష చేత సద్దుమణిగింది. అంతేకాకుండా పంజాబ్లో చెలరేగిన మతఘర్షణలకన్నింటికి తెరదించింది. అహింసా మార్గాన్నే గాంధీజీ స్వాతంత్ర్య సమరానికి ఓ ఆయుధంగా వాడారు.