భారతీయులపై దాడులతో దేశ పరువు పోయింది: ఆసీస్

మంగళవారం, 9 ఫిబ్రవరి 2010 (14:06 IST)
స్వదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివశిస్తున్న భారతీయులపై జరిగిన దాడుల వల్ల ప్రపంచంలో ఆస్ట్రేలియా పరువు పోయిందని ఆ దేశ విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్ అన్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు ఆయన వెల్లడించారు. దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయన్నారు. ఈ దాడుల్లో కొన్ని జాతి వివక్షాపూరితమైనవిగా ఉన్నాయని తెలిపారు.

దాడుల్లో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు దేశం తరపున ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలుపుతున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా దేశంలోని భారతీయ విద్యార్థులు లేదా పౌరులపై జరుగుతున్న దాడుల్లో జాతివివక్ష దాగి ఉందన్నారు. కేవలం ఈ దాడులు కేవలం విద్యా సంబంధాలపైనే కాకుండా, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయని స్మిత్ అభిప్రాయపడ్డారు.

ఇదిలావుండగా, భారతీయులపై జరిగిన దాడులను విక్టోరియా రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత తీవ్రంగా ఖండించారు. సోమవారం భారతీయ పారిశ్రామికవేత్తలతో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రతిపక్ష నేత టెట్ బొయ్‌లివ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని భారతీయులపై జరుగుతున్న దాడుల వల్ల విక్టోరియా ప్రాంతానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇలాంటి దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి