ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సహాయకుడు, మాజీ డిప్యూటీ ప్రధానమంత్రిగా పని చేసిన తారిక్ అజీజ్కు విధించిన మరణశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఐక్య రాజ్య సమితి ఇరాక్ను కోరింది. మానవత్వానికి వ్యతిరేకంగా అజీజ్ హత్యలు, నేరాలకు పాల్పడ్డాడన్న అభియోగంపై ఇరాక్ సుప్రీం క్రిమినల్ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఈ అంశంపై ఐరాస స్పందిస్తూ.. ''మరణశిక్షల విషయంలో ఐరాస వైఖరి తెలిసినదే, మేము మరణశిక్షకు వ్యతిరేకం'' అని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్ అధికార ప్రతినిధి మార్టిన్ నెసిర్కీ తెలిపారు. ఇంకా నెసిర్కీ మాట్లాడుతూ.. ''ఇతర కేసుల విషయంలో మాదిరిగానే ఈ కేసులోకూడా మరణశిక్ష అమలు చేయద్దు అని సూచిస్తున్నాం'' అని చెప్పారు.
ఇటీవల విడులైన ఇరాక్ యుద్ధ రహస్య పత్రాల ప్రకారం.. తూర్పు ఆఫ్రికాలో రెండు అమెరికన్ రాయబార కార్యాలయాలపై 1998లో జరిగిన టెర్రరిస్టు బాంబుదాడులకు ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ఎంతో ఆనందించే వాడని, సద్దాం సన్నిహిత వర్గానికి చెందిన, ఇరాక్ విదేశాంగ శాఖమాజీ మంత్రి తారిక్ అజీజ్ ఎఫ్బిఐకి తెలిపినట్లు వెల్లడించాయి.
అయితే.. ఆల్-ఖైదా నేత ఒసామా బిన్ లాడిన్తో చేతులు కలిపే ఆసక్తి మాత్రం సద్దాంకి లేదని అజీజ్ చెప్పినట్లు ఇటీవల బయట పడిన రహస్యపత్రాలు తెలియచేస్తున్నాయి. అల్ఖైదాని సమర్ధమైన సంస్థగా భావించినా, సద్దాం ఇస్లామిస్టులను విశ్వసించేవాడు కాదని అజీజ్ చెప్పినట్లు 2004, జూన్27 ఇంటరాగేషన్కి సంబంధించిన లిఖిత పత్రాలు వెల్లడిస్తున్నాయి.