ఆస్ట్రేలియాలో దొంగతనానికి పాల్పడిన ఆరోపణలతో భారత విద్యార్థి దేశ బహిష్కరణకు గురయ్యాడు. స్టడీ వీసా కాల పరిమితిని పొడిగించాలని కోరినా ఆస్ట్రేలియా అధికారులు తిరస్కరించారని అక్కడి మీడియా తెలిపింది.
ఉత్తరప్రదేశ్ నుంచి ఐదు సంవత్సరాల క్రితం శివేంద్రసింగ్(30) ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆస్ట్రేలియాలో చదువుతున్న పది వేలమంది భారత విద్యార్థుల్లో సింగ్ ఒకరు. ఆయనపై మూడు దొంగతనం కేసులు ఉండడంతో వీసా కాలపరిమితిని పొడిగించేందుకు ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.
సింగ్ను దేశం విడిచి వెళ్లిపోవాలని ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలశాఖ మంత్రి క్రిస్ ఇవాన్స్ పేర్కొన్నట్లు అక్కడి వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. శివేంద్రసింగ్ ఆస్ట్రేలియాలో ఉండేందుకు రాలేదని, మాస్టర్ డిగ్రీ కోసం వచ్చాడని ఆయన తరపు న్యాయవాది అబ్బి హండెన్ తెలిపారు. అయినా ఇవాన్స్ ఇవేమీ పరిశీలించకుండా సింగ్ వీసాను తిరస్కరించారు.