తన మాతృదేశంతో సంబంధాలు కొనసాగిస్తా: ఎం.ఎఫ్.హుస్సేన్
మంగళవారం, 9 మార్చి 2010 (21:03 IST)
FILE
ప్రముఖ చిత్రకారుడు మక్బూల్ ఫిదా హుస్సేన్ (95) భారత పౌరసత్వాన్ని వదులుకున్నప్పటికీ ఆ దేశంతో సంబంధాలు తెంచుకునేందుకు ఇష్టపడడం లేదు.
తను విదేశాల్లో స్థిరపడినప్పటికీ తన మాతృభూమిని మరువజాలనని, తన మాతృదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తానని ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ మంగళవారం తెలిపినట్లు దుబాయిలోని స్థానిక వార్తా పత్రిక వెల్లడించింది. భారతీయులకు ఇచ్చే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు కోసం తాను దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారని ఆ పత్రిక వెల్లడించింది.
భారతదేశం నా మాతృభూమి. ఆ దేశంతో సంబంధాలను నేనెప్పటికీ వదలుకోను. ఇప్పుడు నేను వదులుకున్నది ఓ కాగితపు ముక్క(పాసుపోర్టు)ను మాత్రమే అని హుస్సేన్ వ్యాఖ్యానించినట్లు స్థానిక పత్రిక వెల్లడించింది. ఆయన తన పాసుపోర్టును ఖతార్లోని భారత రాయబారి దీపా గోపాలన్ వాద్వాకు అప్పగించిన సంగతి విషయం విదితమే.
నేను భారతదేశం నుంచి బయటకు వచ్చేసి వేరే దేశానికి చెందిన పౌరసత్వం తీసుకున్నప్పటికీ భారత్లో పర్యటిస్తూనే ఉంటాను. భారత పౌరుడికి రెండు వేర్వేరు దేశాల పౌరసత్వాలు ఉండేందుకు అక్కడి చట్టాలు అంగీకరించవు కాబట్టి ఓసీఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటానని, నా వృత్తిపరమైన లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకే ఖతార్ పౌరసత్వం తీసుకున్నానని హుస్సేన్ తెలిపినట్లు ఆ పత్రిక పేర్కొంది.