గత ఏడాది నవంబరు 26న ముంబయి మహానగరంపై జరిగిన తీవ్రవాద దాడిలో పాకిస్థాన్ ప్రమేయాన్ని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) కూడా ధృవీకరించింది. ఈ దాడిలో పాల్గొన్న తీవ్రవాదులు కరాచీ నుంచి ముంబయి వచ్చారని బుధవారం ఎఫ్బీఐ వెల్లడించింది.
ముంబయిలోని ప్రత్యేక కోర్టులో ఈ ఉగ్రవాద దాడులపై జరుగుతున్న విచారణకు ఈ రోజు ఎఫ్బీఐ ఏజెంట్ ఒకరు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీవ్రవాద దాడుల్లో పాక్ ప్రమేయాన్ని ఆయన ధృవీకరించారు. జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) డేటాను విశ్లేషించడం ద్వారా ముంబయి దాడుల్లో పాల్గొన్న తీవ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చారని ధృవీకరించామన్నారు.
గత ఏడాది నవంబరు 26 నుంచి 29 వరకు పాకిస్థాన్ నుంచి ముంబయి వచ్చిన పది మంది తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. వారి దాడుల్లో 183 మంది పౌరులు మృతి చెందారు. ఉపగ్రహ ఆధారాలపై సమగ్ర విశ్లేషణ జరిపిన అనంతరం.. దాడిలో పాల్గొన్న పది మంది తీవ్రవాదులు కరాచీ తీరం నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్న విషయం తెలుస్తోందని ఎఫ్బీఐ ఏజెంట్ ముంబయిలోని ప్రత్యేక కోర్టుకు తెలిపారు.