ప్రపంచంలోని అన్ని తీవ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలన్నీ స్వర్గధామంగా ఉన్నాయని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం తీవ్రవాదంపై సాగిస్తున్న యుద్ధానికి పాకిస్థాన్ భూభాగంలో తీవ్రవాద సంస్థలకు ఉన్న సురక్షిత స్థావరాలు పెద్ద సమస్యగా పరిణమించాయని గేట్స్ అభిప్రాయపడ్డారు.
అల్ ఖైదాతోపాటు, తాలిబన్, హకానీ నెట్వర్క్, గుల్బాద్దీన్ హెక్మాత్యార్, ఇతర అనుబంధ సంస్థలు పాకిస్థాన్ భూభాగంలోని సురక్షిత ప్రదేశాల నుంచి కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ తీవ్రవాద సంస్థలన్నీ వేర్వేరు అయినప్పటికీ, పాక్లో స్వర్గధామంగా మారిన ప్రదేశాల నుంచి అవన్నీ కలిసి పనిచేస్తున్నాయి.
వారికక్కడ సురక్షిత ప్రదేశాలు ఉన్నంతవరకు అమెరికా సేనలు తీవ్రవాదంపై జరుపుతున్న పోరుకు పెద్ద అడ్డంకి ఉన్నట్లేనని గేట్స్ ఓ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్లో 20 ఏళ్ల క్రితం తాము సోవియట్ యూనియన్తో అమెరికా పోరాడుతున్నప్పుడు సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ బాధ్యతల్లో నేను కూడా అక్కడ ఉన్నాను.
అమెరికాకు కూడా పాకిస్థాన్లో అప్పుడు ఓ స్థావరం ఉండేది. పాక్ భూభాగంలోని ఈ స్థావరం ఆనాటి పోరులో కీలకపాత్ర పోషించిందని గేట్స్ చెప్పారు. ఇప్పుడు తీవ్రవాదుల విషయంలోనూ తమకు ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఆ దేశాధినేతలుకు కూడా తెలుసు. అక్కడి కార్యకలాపాలు పాకిస్థాన్కు కూడా చాలా ప్రమాదకరమని గేట్స్ వ్యాఖ్యానించారు.