తైవాన్ గ్రామంలో 300 మంది పౌరుల మృతి

దక్షిణ తైవాన్‌లోని ఓ గ్రామంపై ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపుగా గ్రామం మొత్తం శిథిలమైంది. శిథిలాల కింద సుమారు 300 మంది పౌరులు మరణించి ఉంటారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దుర్ఘటన వివరాలను శుక్రవారం తైవాన్ అధికారులు వెల్లడించారు.

కౌంటీ మేజిస్ట్రేట్ జరిగిన ప్రమాదంపై ఇచ్చిన ప్రాథమిక నివేదికలో సుమారు 300 మంది పౌరులు మరణించి ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ గ్రామంలో జరిగిన నష్టంపై ఈ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు. ఈ గ్రామంలోకి ఆర్మీ రోడ్డు తెరిచి, సహాయక సిబ్బందిని పంపిన తరువాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

గత వారం తైవాన్‌లో విలయతాండవం చేసిన మొరకాత్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిశాయి. 2 మీటర్లకుపైగా వర్షపాతం నమొదయింది. వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో అనేక మంది మృతి చెందారు. గత వారాంతానికి తుపాను భీభత్సంలో మృతి చెందిన వారి సంఖ్య 116 వద్ద ఉంది. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి