పాకిస్థాన్లో పర్యటించేందుకు భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంగీకరించారని వాణిజ్య శాఖ మంత్రి అమీన్ ఫహీమ్ అన్నారు. అమీన్ భారత పర్యటనలో చివరిరోజు మన్మోహన్ సింగ్ను కలిసినప్పుడు తమ దేశంలో పర్యటించాల్సిందిగా ఆహ్వానించగా దానిని ఆయన అంగీకరించారని ఓ ప్రకటనలో తెలియజేశారు.
అయితే మన్మోహన్ ఎప్పుడు ఇస్లామాబాద్లో పర్యిటిస్తారన్న విషయాన్ని మాత్రం ఫహీమ్ తెలియజేయలేదు. పేదరిక నిర్మూలనకు పాక్, భారతదేశాలు కలిసి కృషి చేస్తాయని తెలిపారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెంపునకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సింగ్ హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా, భారత వాణిజ్య మంత్రి ఆనంద శర్మ వచ్చే నెలలో వ్యాపారవేత్తల బృందంతో పాటు పాక్లో పర్యటించనున్నారు.