తాను సెనెటర్ కాక ముందు నల్లజాతీయుడిగా వివక్షను ఎదుర్కొన్నట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. గతయేడాది దారుణంగా హత్యకు గురైన నల్లజాతి యువకుడు ట్రాయ్వాన్ మార్టిన్ కేసులో ప్రధాన నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ తీర్పుపై ఒబామా స్పందిస్తూ ట్రాయ్వాన్ మార్టిన్ హత్యకు గురైనప్పుడే నేను చెప్పాను. అతను నా కొడుకే కావచ్చునని, లేదా 35 ఏళ్ల కిందట నేనే అయి ఉండేవాడినని అని అన్నారు. అమెరికాలో జాతివివక్ష ఎదుర్కోని నల్లజాతీయులు చాలా తక్కువ అని చెప్పుకొచ్చారు.
షాపింగ్ చేస్తుండగా తమను ఎవరో వెంటాడుతున్న అనుభవంలేని ఆఫ్రికన్ - అమెరికన్లు చాలా తక్కువ మంది ఈ దేశంలో ఉన్నారు. వారు వీధుల్లో నడుస్తుండగా కారు డోర్లను విసురుగా పెట్టుకొనే అనుభవాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా తాను సెనేటర్ కాకముందు వరకు నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు.
కాగా, 2012 ఫిబ్రవరిలో ఫ్లోరిడాలో 17 ఏళ్ల యువకుడు మార్టిన్ను జార్జ్ జిమ్మర్మ్యాన్ అనే వ్యక్తి కాల్చిచంపాడు. నిరాయుధిడైన యువకుడిపై ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు అతడు చెప్పిన వాదనలు నమ్మి కోర్టు నిర్దోషిగా వదిలిపెట్టింది. క్రిమినల్ చట్టాలు, శిక్షల విషయంలోనూ నల్లజాతీయులు జాతివివక్షను ఎదుర్కొన్న ఘటనలు అమెరికా చరిత్రలో చాలా ఉన్నాయని ఒబామా పేర్కొన్నారు.