శ్రీలంక: యుద్ధ నేరాల దర్యాప్తుకు ఐరాస విజ్ఞప్తి

శ్రీలంకలో వేర్పాటువాద ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థ అణిచివేత సందర్భంగా జరిగిన అనుమానాస్పద యుద్ధ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ విజ్ఞప్తి చేశారు. శ్రీలంక అంతర్యుద్ధంలో విజయం సాధించిన ప్రభుత్వ దళాలు, ఓడిపోయిన ఎల్టీటీఈ చర్యలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని మూన్ అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యులతో జరిగిన అంతరంగిక సమావేశంలో మూన్ మాట్లాడుతూ.. శ్రీలంక ప్రభుత్వ పూర్తి మద్దతు, అంతర్జాతీయ సహకారంతో శ్రీలంక యుద్ధ నేరాలపై విశ్వసనీయ దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఈ దర్యాప్తు జరపాల్సిన తీరుతెన్నులను వివరించేందుకు ఆయన నిరాకరించారని ఈ సమావేశానికి హాజరైన ఐరాస అధికారులు తెలిపారు.

శ్రీలంక యుద్ధంలో తీవ్రస్థాయిలో అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. శ్రీలంక యుద్ధంపై అర్ధవంతమైన దర్యాప్తు జరపాల్సి ఉందని బాన్ కీ మూన్ శుక్రవారం ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద విలేకరులతో చెప్పారు. దీనికి ఐరాస సభ్యదేశాల మద్దతు కావాలని, ఈ దర్యాప్తు నిస్పాక్షికంగా జరిపించాల్సి ఉందని మూన్ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి