అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నాడని పాకిస్థాన్ జర్నలిస్టు కూడా స్పష్టం చేస్తున్నాడు. పైగా తాను రెండుసార్లు కలిసినట్టు చెప్పుకొస్తున్నాడు. దీంతో దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడన్న పాకిస్థాన్ వాదనలో నిజం లేదని తేలిపోయింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దావూద్ ఇబ్రహీం ప్రధాన సూత్రధారి. అతని కోసం భారత్ గాలిస్తోంది. అయితే, పాకిస్థాన్లో తలదాచుకున్న దావూద్.. ఆ దేశ ఐఎస్ఐ సంరక్షణలో ఉన్నాడు.
ఈ పరిస్థితుల్లో భారత్ నిఘా వర్గాలు కూడా దావూద్ కరాచీలోనే ఉన్నట్టు పక్కా ఆధారాలు వెల్లడించాయి. ఇపుడు తాజాగా పాకిస్థాన్ జర్నలిస్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. కరాచీలో ఉన్న దావూద్ ను తాను రెండుసార్లు నేరుగా కలిశానని ఆ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ ఈ మేరకు ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.