46 శాతం తగ్గిన భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులు!
శుక్రవారం, 8 జనవరి 2010 (09:38 IST)
ఆస్ట్రేలియాలో జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల ఆసక్తి చూపడం లేదు. ఈ యేడాది ఆ దేశంలో విద్యాభ్యాసం చేసేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య 46 శాతం మేరకు తగ్గినట్టు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో 20 శాతం మేర తగ్గాయని విదేశాంగశాఖ ప్రతినిధి శాండీ లోగాన్ వివరించారు. వీసా దరఖాస్తుల తగ్గుదలకు ప్రధానంగా జాత్యాహంకారం, విదేశీ విద్యార్థులపై దాడులే కారణమని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దీనితో పాటు వీసా దరఖాస్తులను నిశితంగా పరిశీలించి వలస నిబంధనలకు అనుగుణంగా లేని దరఖాస్తులను తిరస్కరిస్తున్నామన్నారు. భారత్ నుంచి అందుతున్న వీసా దరఖాస్తులు తగ్గిన మాట వాస్తవమని ఆయన అన్నారు.
ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలోని భారత విద్యార్థులపై జరుగుతున్న వరుస దాడులు అక్కడ పెరుగుతున్న నగర నేరాల్లో భాగమేనని భారత్లో ఆస్ట్రేలియా హైకమిషనర్ పీటర్ వర్ఘీస్ అభిప్రయాపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆస్ట్రేలియాకు విదేశీ విద్యార్థులు తమ దేశానికి వెళ్లబోరని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుడా, నితిన్ గార్గ్ హత్య అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లే పర్యాటకులకు భారత్ హెచ్చరికలు జారీ చేయటంపై వర్ఘీస్ స్పందిస్తూ భారత్ స్పందనను తాము అర్థం చేసుకున్నామని, అయితే ఇటువంటి హెచ్చరికలు జారీ చేయాల్సిన పరిస్థితులు ఆస్ట్రేలియాలో లేవని వివరించారు. ఈ దాడులు కేవలం అవకాశవాద నగర నేరాల్లో భాగంగా మాత్రమే జరుగుతున్నాయన్నారు.