నో డౌట్.. ఈ కరోనా చైనా ప్రయోగించిన జీవాయుధమే : ఆస్ట్రేలియా పత్రిక కథనం

సోమవారం, 10 మే 2021 (08:35 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను చైనా కృత్రిమంగా ఉపయోగించిందనే వాదనలు వచ్చాయి. ఈ విషయంలో చైనాకు అండగా నిలిచిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ముద్దాయిగా నిలిచింది. ఆ తర్వాత కరోనా వైరస్‌ను చైనా తయారు చేయలేదని ఆ సంస్థ ప్రకటించింది. అయితే, ఇపుడు ఆస్ట్రేలియన్ పత్రిక ఒకటి సంచలన కథనాన్ని ప్రచురించింది. 
 
ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించేందుకు చైనా కృత్రిమంగా తయారుచేసిన జీవాయుధమే కరోనా వైరస్ అని ఆ పత్రిక పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మహమ్మారి విషయంలో చైనాపై ఇప్పటివరకు ఉన్న అనుమానాలు నిజమేనని ఈ కథనం చెబుతోంది.
 
కరోనా వైరస్ వెలుగులోకి రావడానికి సరిగ్గా నాలుగేళ్ల ముందు.. అంటే 2015లో చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు రూపొందించిన ఓ నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో వారు కరోనా వైరస్‌ను జీవాయుధంగా అభివర్ణించారు. 
 
మనుషుల్లో భయంకరమైన వ్యాధిని కలిగించే ఈ వైరస్‌ను ఓ ఆయుధంగా వాడుకోవాలన్న కుట్ర ఈ నివేదికలో స్పష్టంగా కనిపిస్తోందని పత్రిక పేర్కొంది. మూడో ప్రపంచ యుద్ధంలో జీవాయుధంగా ఈ వైరస్‌ను ఉపయోగించేందుకు చైనా దీనిని అభివృద్ధి చేసిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని రాసుకొచ్చింది.
 
ఆరేళ్ల క్రితమే చైనా మిలటరీ శాస్త్రవేత్తలు దీని గురించి చర్చించారని కూడా వివరించింది. కరోనాలోని కొత్త స్ట్రెయిన్లను ఎలా ప్రయోగించాలన్న దానిపైనా వారి మధ్య తీవ్ర చర్చ జరిగిందని తెలిపింది. 
 
వైరస్ మూలాలపై బయటి సంస్థలు దర్యాప్తు జరిపితే దాని గుట్టు ఎక్కడ బయటపడిపోతుందోననే ఉద్దేశంతోనే బయటి సంస్థల దర్యాప్తును చైనా వ్యతిరేకించిందని పత్రిక పేర్కొంది. ఆ వైరస్ ఓ మాంసం మార్కెట్లో పుట్టిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నించిందని పత్రిక తన కథనంలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు