ఇండియాస్ డాటర్పై ఇండియాలోనే నిషేధం విధించడం తీవ్రంగా బాధించిందని ఆ డాక్యుమెంటరీ రూపొందించిన లెస్లీ ఉడ్విన్ అన్నారు. ఇండియాస్ డాటర్ పేరుతో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై బ్రిటన్ దర్శకురాలు లెస్లీ ఉద్విన్ రూపొందించిన డాక్యమెంటరీని ఎట్టకేలకు బీబీసీ బుధవారం రాత్రి ప్రసారం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ డాక్యుమెంటరీని భారత్లో నిషేధం విధించడంతో యూకే సహా ఇతర దేశాల్లో ప్రసారం చేసింది.
భారత్లో ఈ డాక్యుమెంటరీని నిషేధించటం తీవ్రంగా బాధించిందని డాక్యుమెంటరీ రూపొందించిన లెస్లీ ఉడ్విన్ అన్నారు. మహిళా హక్కుల కోసం తన చిన్న కూతురిని, ఇంటిని వదిలి రెండేండ్లు కష్టపడి డాక్యుమెంటరీని నిర్మించానని, నాగరిక చట్టాలున్న భారత్లో భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవటం విచారకరమని తన బ్లాగ్లో లెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ డాక్యుమెంటరీ కేవలం భారత్ గురించేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళల స్థితిగతులపై రూపొందించామన్నారు. సంచలనం చేసేందుకే ఒక మీడియా సంస్థ దీనిని వివాదం చేసిందని విమర్శించారు. ఇదిలా ఉంటే, డాక్యుమెంటరీ ప్రసారం చేసేందుకు అనుమతివ్వటమే మంచిదని భారత్లోని సోషల్మీడియా యూజర్లలో అత్యధిక మంది అభిప్రాయపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది.
ఈ డాక్యమెంటరీపై నిర్భయ తల్లి మాట్లాడుతూ, డాక్యుమెంటరీ నిర్మించడం, నిందితుడి ఇంటర్యూ చేయడం వంటి విషయాలు తమ కుమార్తెకు న్యాయం చేయలేవని పేర్కొన్నారు. తమ కూతురు చనిపోయిందని, ఏదీ ఆమెను వెనక్కి తీసుకురాలేవన్నారు. తాము కేవలం న్యాయం మాత్రమే కోరుతున్నామని అన్నారు. ఆ డాక్యుమెంటరీ తమకు ముఖ్యం కాదన్నారు. ఇక నిర్భయ తండ్రి కూడా ఆ డాక్యుమెంటరీ ప్రసారం చేస్తే మంచిదన్నారు.