మసూద్ అజర్‌కు షాకిచ్చిన పాకిస్థాన్... ఉగ్రవాదుల నాలుగు వేల బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్

మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:09 IST)
అమెరికా వార్నింగ్‌తో పాకిస్థాన్ దిగివచ్చింది. పాక్ భూభాగంలో ఉన్న ఉగ్ర తండాలపై దాడులు చేయకుంటే తామే రంగంలోకి దిగుతామని అగ్రరాజ్యం హెచ్చరించడంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. దీనికితోడు అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్నామని భావించిన పాకిస్థాన్ ఉగ్రవాదులపై చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా ఉగ్రవాదులకు చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. 
 
దీంతో ఈ ఖాతాలన్నీ జైషే మహ్మద్ (జీఈఎం) తీవ్రవాద సంస్థకు చెందినవిగా భావిస్తున్నారు. ఈ చర్యతో ఆ సంస్థ చీఫ్ మసూద్ అజర్‌కు షాక్‌కు గురయ్యారు. ఉగ్రవాదులువిగా అనుమానిస్తున్న 4000 బ్యాంకు అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చట్టం(ఏటీఏ) కింద ఫ్రీజ్ చేసిన ఈ ఖాతాల్లో ఉగ్రవాది మసూద్ అజర్‌ అకౌంట్ కూడా ఉండడం గమనార్హం. 
 
ఈ ఖాతాల్లో నికర మొత్తం రూ.40 కోట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్(ఎస్‌బీపీ) ఫ్రీజ్ చేసిన 1200 అకౌంట్లను ఏటీఏలోని ‘ఎ’ కేటగిరీలో చేర్చింది. ‘ఎ’ కేటగిరీని ఉగ్రవాదుల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. మసూద్ అజర్ అకౌంట్‌ను కూడా ‘ఎ’ కేటగిరీ కింద చేర్చినట్టు అధికారులు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి