యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడం వల్ల భారతదేశానికి నష్టాలు మాత్రమే కాదు, లాభాలు కూడా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బ్రెగ్జిట్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాస్త సంయమనం పాటిస్తే మంచి ప్రయోజనాలను రాబట్టుకోవచ్చునంటున్నారు. బ్రెగ్జిట్ వల్ల గ్లోబల్ మార్కెట్లు దెబ్బతింటుండటంతో క్రూడ్ ధరలు తగ్గుతాయి.
క్రూడ్ ధర కనీసం ఒక్క డాలర్ తగ్గినా మన దేశానికి దిగుమతుల ఖర్చులు కనీసం 100 కోట్ల డాలర్లు ఆదా అవుతుంది. ఆర్థిక రంగంలో ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు కూడా ఇది దోహదపడుతుంది. ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. వస్తువుల ధరలు ప్రపంచ వ్యాప్తంగా తగ్గడం వల్ల భారతదేశం మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. పెట్టుబడిదారులు అనవసర భయాలకు లోనుకాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే బ్రెగ్జిట్ వల్ల సత్ఫలితాలు పొందవచ్చంటున్నారు.