ఓ పక్క స్నేహాస్తం అందిస్తూనే మరోవైపు వెనుకనుంచే గోతుల తవ్వే పనిలో చైనా నిమగ్నమైనట్టు తేలింది. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అనేక రెబెల్ గ్రూపులకు చైనా ఆర్థిక సాయం చేస్తూ, భారత భద్రతా బలగాలపై దాడులకు తెగబడేలా ప్రోత్సహిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
ముఖ్యంగా, జూన్ 4వ తేదీన మణిపూర్లో సైన్యంపై మిలిటెంట్లు దాడి చేసి 18 మంది భద్రతాదళ సిబ్బందిని బలితీసుకున్న ఘటన వెనుక ఈ డ్రాగన్ దేశ హస్తమున్నట్టు నిఘావర్గాలు పసిగట్టాయి. ఈ దాడితో పాటు ఆర్థికసాయం చేస్తున్నాయనే విషయానికి సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో భారత నిఘావర్గాలు నిమగ్నమైవున్నాయి.
గత నెలలో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ - కాఫ్ లాంగ్ (ఎన్ఎస్ సీఎన్-కే) మిలిటెంట్లు జరిపిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతితెలిసిందే. చైనా ఏర్పాటు చేసిన యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ వెస్ట్రన్ సౌతాసియా దళం చెప్పుచేతల్లో ఉన్న యునైటెడ్ నేషన్స్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్) పని చేస్తూ.. చైనా ప్రోద్బలంతోనే దాడి జరిగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయని సమాచారం.