టోక్యో పార్కులో వినోదం కోసం చేపలను మంచులో ఉంచారు.. 25 రకాల చేపలను..?

సోమవారం, 28 నవంబరు 2016 (14:42 IST)
జపాన్ రాజధాని టోక్యోలో ఇప్పటికే పొగమంచు ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్‌లోని ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ నిర్వాహకులు చేసిన వినూత్న ప్రయోగం విమర్శలకు దారితీసింది. చేపలను హింసకు గురిచేయడంతో సదరు అమ్యూజ్‌మెంట్ పార్కును మూతపెట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే..? ఆదివారం కిటాక్యుషులోని ఓ పార్కులో వినూత్న ప్రయోగం చేశారు. 
 
పార్క్‌లోని స్కేటింగ్‌ రింక్‌ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని సుమారు 5000 చేపలను ఐస్‌‌లో అక్కడక్కడా ఉంచారు. 250 మీటర్ల పొడవున్న ఐస్‌ సర్క్యూట్‌ లో 25 రకాల చేపలను పర్యాటకులకు కనిపించేలా ఏర్పాటుచేశారు. దీనిని చూసిన వారికి సముద్రంలోని చేపల్లా కనిపించాలని అలా చేశామని పార్కు నిర్వాహకులు తెలిపారు. 
 
'ఎట్రాక్షన్‌ నెవర్‌ హియర్డ్‌ అబౌట్‌' అంటూ నిర్వాహకులు చేసిన ఈ ఘనకార్యం పర్యాటకులను ఆకట్టుకునే మాట అటుంచితే.. చేపలను అలా ఐస్‌లో ఉంచడం సబబు కాదని సోషల్ మీడియాలో నిరసన వ్యక్తమైంది. చనిపోయిన చేపలను అలా మంచులో చూడటం చాలా అసహజమైన, అభ్యంతరకరమైనరీతిలో ఉందని జంతు ప్రేమికులు మండిపడ్డారు. వినోదం కోసం ఇంత క్రూరత్వం అవసరమా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సదరు పార్కును మూతబెట్టారు. 

వెబ్దునియా పై చదవండి