పశ్చిమాసియాలో మరోమారు యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికాకు ఇరాన్ మరోమారు గట్టివార్నింగ్ ఇచ్చింది. తమపై దాడి చేస్తే ప్రతిదాడి ఊహకు అందని విధంగా ఉంటుందని హెచ్చరించింది. తమపై దాడికి ప్రయత్నిస్తే అది శత్రువుల జీవితంలో అతిపెద్ద తప్పు అవుతుందని అమెరికాకు ఇరాన్ తెలిపింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తమ జోలికి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని, పూర్తి బలంతో విరుచుకుపడతామని ఇరాన్ సైనిక ఉన్నతాధికారులు హెచ్చరించారు. ముందుగా ఎవరిపైనా దాడి చేయబోమని, కానీ తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే మాత్రం ప్రతిస్పందన ఊహకు అందదని తేల్చి చెప్పారు. ఇప్పటికే కీలక ప్రాంతాల్లో క్షిపణి వ్యవస్థలను మొహరించినట్టు ఇరాన్ వెల్లడించింది.
కొంతకాలంగా ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమాలను, రక్షణ ఒప్పందాలపై అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. దీనికితోడు పశ్చిమాసియాలోని కీలక జల సంధుల్లో అమెరికా నౌకాదళం గస్తీ పెంచడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ తన సైనిక శక్తి ప్రదర్శిస్తూ అత్యాధునిక డ్రోన్లు, సుదూర క్షిపణులను ప్రదర్శనకు ఉంచుతుంది.