అంతర్జాతీయ దేశాలను వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు గట్టిదెబ్బ తగిలింది. టాప్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, టాప్ సైబర్ జిహాదీగా పేరున్న అబూహసన్ అల్ బ్రితానీ అలియాస్ జునైద్ హుస్సేన్ హతమయ్యాడని అమెరికా ప్రకటించింది. జునైద్ మరణంతో సిరియాలో సంయుక్త దళాలు కీలక విజయం సాధించినట్లయిందని బ్రిటన్ ప్రభుత్వాధికారి తెలిపారు.
ఐఎస్ఐఎస్కు టెక్నాలజీని పరిచయం చేసి, ఆపై పలు దేశాల అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసిన పేరున్న బ్రిటన్ వాసి జునైద్, సిరియాలో తాము జరిపిన డ్రోన్ దాడుల్లో మరణించాడని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్ మైఖేల్ మెక్ కౌల్ తెలిపారు. ఉగ్రవాదంపై తాము ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నామని, కొత్త నియామకాలు ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.