ముంబై 26/11 దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్ -ఏ-తోయిబా నాయకుడు జకి ఉర్ రహమాన్ లఖ్వీని విడుదల చేయాలని లాహోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం లఖ్వీ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు లఖ్వీ నేరం చేశాడనేందుకు సరైన సాక్షాలు ఎందుకు సమర్పించలేదని పంజాబ్ (పాకిస్థాన్) ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
"లఖ్వీపై ఆరోపణలు చేస్తున్నారు, అతని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసి నిర్బంధించారు. ఇంత జరిగిన తరువాత మీరు ఎందుకు సాక్ష్యాలు సేకరించలేకపోయారు" అని ప్రశ్నించారు. "మీరు సాక్షాలు సేకరించి న్యాయస్థానం ముందు సమర్పించండి తరువాత చూద్దాం" అని అన్నారు. సరైన సాక్షాలు సమర్పించలేని కారణంగా నిర్బంధం ఎత్తివేస్తున్నామని, వెంటనే లఖ్వీని విడుదల చెయ్యాలని హైకోర్టు సూచించింది.
రూ. 10 లక్షల విలువైన రెండు బాండ్లు కోర్టుకు సమర్పించాలని లఖ్వీ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తాము అన్ని సాక్ష్యాలు సమర్పించినా లఖ్వీని న్యాయస్థానం విడుదల చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అంటున్నారు. ఇకపోతే.. లఖ్వీ విడుదలపై భారత్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అనే దానిపై సరైన ఆధారాలను సేకరించలేకపోయిందని పాక్ సర్కారుపై భారత ఉన్నతాధికారులు ఫైర్ అవుతున్నారు.