చైనా లిటిల్ ట్రిక్స్: మోడీ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించకూడదట..!

మంగళవారం, 12 మే 2015 (18:54 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో పర్యటించనున్నారు. అయితే మోడీ తమ దేశంలోకి అడుగుపెట్టకముందే అక్కడి మీడియా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మోడీ వివాదాస్పద సరిహద్దు ప్రాంతాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సందర్శించరాదని చైనా ప్రముఖ దినపత్రిక 'ద గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టాలని సూచించింది. చైనాతో చర్చల నేపథ్యంలో పరపతి పెరుగుతున్నందున, స్వదేశంలోనూ ప్రతిష్ఠను ఇనుమడింపజేసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొంది. 
 
అయితే, సరిహద్దు విషయంలో చిన్నపాటి ట్రిక్కులకు తెరదీస్తున్నారని ఆరోపించింది. మోడీని దార్శనికుడిగా కంటే కార్యసాధకుడిగానే భావించవచ్చని 'ద గ్లోబల్ టైమ్స్' పేర్కొంది. ఇక, భారత సర్కారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు మద్దతు తెలపడాన్ని నిలిపివేయాలని చైనా మోడీకి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంకా ఇండో-చైనా సంబంధాలకు టిబెట్ సమస్యను అడ్డంకిగా పేర్కొనడాన్ని కట్టిపెట్టాలని స్పష్టం చేసింది. మోడీ పర్యటన చైనా-ఇండియా సంబంధాలను మెరుగుపర్చగలదా? అంటూ శీర్షిక పెట్టి పైవిధంగా పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి