ప్రపంచాన్ని భయపెట్టిన వింత అలలు... శాస్త్రవేత్తల్లో వణుకు

శుక్రవారం, 30 నవంబరు 2018 (15:45 IST)
ప్రపంచాన్ని వింత అలలు భయపెడుతున్నాయి. ఈ అలల శబ్దం మనుషులు గుర్తించలేకపోయారు. కానీ, యంత్రాలు మాత్రం గుర్తించాయి. భూకంపాలపై అధ్యయనం చేసే ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వింత అలలు సృష్టించిన గ్రాఫ్‌ను పోస్ట్ చేశాడు. ఈ వింత అలలు వివరాలను పరిశీలిస్తే, 
 
నవంబరు 11వ తేదీ ఉదయం 9.30 గంటల సమయంలో ఆఫ్రికా, మడగాస్కర్ మధ్య ఉన్న మయోటె దీవి తీరానికి 15 మైళ్ళ దూరంలో హిందూ మహాసముంద్రంలో ఈ భూకంప అలలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఈ అలలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఈ అలలు సుమారు 20 నిమిషాల పాటు కనిపించాయి. 
 
ఆ తర్వాత ఈ అలలు మెల్లగా ఆఫ్రికాలోని జాంబియా, కెన్యా, ఇథియోపియా తీరాలకు వ్యాపించాయి. అక్కడి నుంచి అట్లాంటిక్ మహాసముద్రానికి వ్యాపించి.. చిలీ, న్యూజిలాండ్, కెనడాలతోపాటు మయోటె దీవికి 11 వేల మైళ్ల దూరంలో ఉన్న హవాయిని కూడా తాకినట్లు నేషనల్ జాగ్రఫిక్ వెల్లడించింది. 
 
కానీ, ఈ అలలను ఏ ఒక్క పరిశోధకుడూ గుర్తించకపోగా.. మెషీన్లు మాత్రం కనిపెట్టాయి. భూకంపాలను అధ్యయనం చేసే ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వింత అలలు సృష్టించిన గ్రాఫ్‌ను పోస్ట్ చేశాడు. ఇవి అసాధారణమైన, విచిత్రమైన భూకంప అలలు అని ఆ వ్యక్తి అందులో పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సిగ్నల్ కనిపించింది. 
 
ఈ పోస్ట్ భూకంపాలపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేపింది. అసలు ఈ అలలు ఏర్పడటానికి కారణం ఏమిటన్నదానిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. భారీ భూకంపాలు వచ్చినపుడే సాధారణంగా ఇలాంటి అలలు ఏర్పడతాయి. భూకంపాలు ఏర్పడినపుడు మొదట పీ వేవ్స్, తర్వాత ఎస్ వేవ్స్ వస్తాయి. కానీ మయోటెతోపాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో అలాంటి భూకంపమేదీ ఏర్పడలేదు. 
 
మరి ఈ అలల వెనుక కారణమేంటి? దీనికి ఇప్పుడు ఎన్నో కారణాలు చెబుతున్నారు. ఏదైనా ఉల్క వచ్చి సముద్రంలో పడిందా? సబ్‌మెరైన్ వోల్కనోనా? న్యూక్లియర్ టెస్టా? అని ఒక్కొక్కరు ఒక్కో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితమైన కారణం మాత్రం ఇప్పటివరకు బయటకు రావడం లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు