శ్రీనివాస్ హత్య కలచివేసింది.. జాతి విద్వేషపూరిత చర్యగా అభివర్ణించొద్దు : వైట్‌హౌస్

మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:38 IST)
అమెరికాలోని కన్సాస్‌ నగరంలో హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. ఈ కాల్పుల ఘటన, ఆపై కన్సాస్ నుంచి వెలువడుతున్న వార్తలు తనను కలచివేశాయని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ పేర్కొన్నారు. 
 
కన్సాస్ నగరంలో బుధవారం జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా, ఆయన స్నేహితుడు అలోక్, మరో అమెరికన్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనను జాతి విద్వేష పూరిత చర్యగా అభివర్ణించడం తగదని, ఇటువంటి చర్యలను ఎవ్వరూ సమర్థించబోరని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు స్పైసర్ పేర్కొన్నారు. 
 
"అమెరికా పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను పరిరక్షించడమే మా విధి. ఇక్కడ స్వేచ్ఛగా సంచరించేందుకు ఏ ఒక్కరు కూడా భయపడకుండా చూస్తాం. ఎవరి మతాన్ని వారు ఎలాంటి సంకోచం లేకుండా అవలంభించవచ్చు. అమెరికన్ జాతి సూత్రాలను కాపాడేందుకు అధ్యక్షుడు కట్టుబడివున్నారు" అని స్పైసర్ వ్యాఖ్యానించారు.
 
కాగా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్, తన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హెచ్-1బీ వీసాల విషయంతో పాటు, ఇండియన్స్ పై దాడుల గురించి యూఎస్ అధికారులతో చర్చించనున్న నేపథ్యంలో వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి