నిత్యా మీనన్ బిజీగా వుంది.. రిలీజ్ తర్వాత వస్తుంది... సందీప్ కిషన్ ఇంటర్వ్యూ
గురువారం, 9 జూన్ 2016 (19:48 IST)
ఛోటా కె. నాయుడు మేనల్లుడుగా నటుడిగా కెరీర్ను ప్రారంభించిన సందీప్ కిషన్.. సినిమా సినిమాకూ కొత్తదనాన్ని కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు. తన వద్దకు వచ్చిన కథల్ని ముందుగా తానే వింటాననీ, ఆ తర్వాత మామయ్యకు విన్పిస్తానని వెల్లడిస్తున్నాడు. తాజాగా ఒక్క అమ్మాయి తప్ప' కథను రెండేళ్ళక్రితం తన వద్దకే వచ్చిందనీ... ఇతర హీరోల వద్దకు తిరిగి.. ఆఖరికి మరలా తనవద్దకు రావడం.. మామయ్య చేయమనడంతో సెంటిమెంట్గా భావించి.. పారితోషికం లేకుండా చేశానని అంటున్నాడు. ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
రెండేళ్ళకు పైగా పట్టడానికి కారణం?
'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమా చేస్తున్నప్పుడు ఈ కథ విన్నాను. కానీ ఈ కథతో సినిమా చేయడం రిస్క్ అనిపించడంతో ఇతర హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. కానీ అనుకోకుండా మరలా మా దగ్గరకే వచ్చింది. మా శ్రమ ఫలితంగా నిర్మాత దొరకడంతో సినిమా పట్టాలెక్కింది.
పారితోషికం తీసుకోకపోవడానికి కారణం అదేనా?
సినిమా ముందుకు కదలాలంటే ఎవరో ఒకరు రిస్క్ చేయడం తప్పనిసరి కావడంతో నేనే ఆ రిస్క్ తీసుకుని నిర్మాతలతో 'ముందు సినిమా చేద్దాం, సినిమా హిట్ అయితేనే నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి' అన్నాను. నేను ఆవిధంగా చెప్పడంతో వాళ్లు కన్విన్స్ అయ్యారు. మేమందరం కలిసి ఒక మంచి సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది.
కథకు బాగా కనెక్ట్ అయినట్టున్నారు?
అవును. ఇప్పటివరకూ నేను చేసిన వాటిల్లో నా బెస్ట్ సినిమా 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ సినిమా కోసం మనస్పూర్తిగా చాలా కష్టపడ్డాను.
కథ చాలా కాలం క్రితం విన్నారు కదా? ఇప్పుడు ఏమైనా మార్పులు చేశారా?
కథ పరంగా పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఇంతకుముందు కథలో బేగంపేట ఫ్లై ఓవర్ అని ఉండేది. దాని హై టెక్ సిటీ ఫ్లై ఓవర్ నేపథ్యంగా మార్చాం.
నిత్యామీనన్ ఎలా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చింది?
సినిమా అనుకున్నప్పటి నుంచీ నిత్యామీనన్ని హీరోయిన్గా అనుకున్నాం. కానీ కుదరకపోవడంతో వేరే హీరోయిన్ని తీసుకోవాలనుకున్నాం. అయితే అదృష్టవశాత్తు ఆమెను కలవడం, కథ చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగిపోయాయి.
ఆమె టాలెంటెడ్ కదా.. మిమ్మల్ని ఎక్కడైనా డామినేట్ చేసిందా?
లేదు. ఎప్పుడూ అలా జరుగలేదు. ఈ సినిమాలో నా పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి నాకెప్పుడూ అలా అనిపించలేదు సరికదా ఆమెతో పనిచేయడం మంచి అనుభవాన్ని ఇచ్చింది.
ప్రమోషన్స్లో ఆమె ఎందుకు పాల్గొనడం లేదు?
ప్రస్తుతం సుదీప్తో కలిసి ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నది. 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా విడుదల అయిన తర్వాత తను ప్రమోషన్స్లో పాల్గొంటుంది.
ఇంతకు ముందు 'రన్' సినిమాకూ గొప్పగా చెప్పారు కదా?
ప్రతి సినిమా హిట్ కావాలనుకుంటాం. రన్ కూడా కొత్త కాన్సెప్ట్.. కానీ జనాలకు నచ్చలేదు. అనిల్ సుంకర్ గొప్ప వ్యక్తి. నాకు మంచి లైఫ్ ఇచ్చారు. ఆయనకు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ వుంది.
ఫ్లై ఓవర్పై కథేమిటి?
ఈ సినిమా కథ హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పైన జరుగుతుంది. దానిపై బాంబు బెదిరింపు రావడం, అక్కడ అనుకోకుండా నేను, నిత్యామీనన్ కలవడం, కలసిన తరువాత ఆ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాం? తరువాత ఏం జరుగుతుందనేది! మిగతా కథ.
కష్ణవంశీ సినిమా ఎలా వస్తుంది?
ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నది. ఆయనతో పనిచేయడం నాకంతా కలలా అనిపిస్తున్నది.
కొత్త చిత్రాలు?
ప్రస్తుతం రెండు తమిళ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అవి తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఒకటి రెజీనాతో, మరొకటి లావణ్య త్రిపాఠితో ఉంటుంది. కానీ ప్రస్తుతం నా దృష్టి అంతా 'ఒక్క అమ్మాయి తప్ప' పైనే ఉంది. ఈ సినిమా అందరినీ అలరిస్తుంది అనుకుంటున్నా అని చెప్పారు.