వామ్మో... ఆ సమోసాలు అంత ధరా..!

Gulzar Ghouse

మంగళవారం, 18 నవంబరు 2008 (17:41 IST)
అలనాటి చంద్రగుప్త మౌర్య చక్రవర్తి తన సైన్యం కోసం గజరాజులను కొనుగోలు చేసిన గడ్డపై కేవలం నాలుగు సమోసాలు అక్షరాలా పది వేల రూపాయల ధర పలికాయి. ఏమిటీ.. ఇది ఒట్టి మాటలు అని అనుకుంటున్నారా. కాదండీ.. ఇది సత్యం. వేలాది మంది జనం సాక్షిగా ఆ స్టాల్ వ్యాపారి నాలుగు సమోసాలను రూ.పదివేలకు అమ్మాడు. ఈ నమ్మలేని నిజాన్ని తెలుసుకోవాలని ఉందా..? అయితే ఇక చదవండి.

బీహార్ రాష్ట్రంలోని సోన్పూర్ గ్రామంలో పశువుల సంత జరిగింది. ఇక్కడ ఒక గుర్రం వెల అక్షరాల మూడు లక్షల రూపాయలు. ఇందులో వింత ఏమీ లేదు. కానీ.. అందరికీ ఇష్టమైన గరం..గరం.. సమోసా ధర నిజంగా బంగారాన్ని తలపించింది. వివరాలలోకి వెళితే... ప్రతి ఏటా బీహార్ రాష్ట్రం సోన్పూర్‌లోని హరిహరక్షేత్రంలో జరిగే పశువుల సంతకు ఆసియా ఖండంలోనే మంచి పేరుంది.

ఈ సంతను వీక్షించడానికి దేశ - విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీన్నిదృష్టిలో పెట్టుకుని అక్కడ తినుబండరాలు, ఇతర వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేయడం అనవాయితీగా వస్తోంది. ఇలాగే.. ఒక వ్యక్తి సమోసాల కొట్టు పెట్టి విక్రయిస్తున్నాడు. ప్రతిఏడాదిలాగే ఈయేటా కూడా కార్తీక మాసం పౌర్ణమి నాడు ప్రారంభమైన ఈ మేళాలో పలు విదేశాలకు చెందిన పర్యాటకులు పాల్గొన్నారు. ఇలాంటి వారిలో డచ్‌ దేశస్థులు ఉన్నారు.

వారిలో ఒక జంట సమోసాలమ్మే స్టాల్ దగ్గరకు వెళ్లి నాలుగు సమోసాలు తిన్నారు. ధరఎంత? అని అడిగితే అక్షరాల పదివేల రూపాయలంటే వారు బేరానికి దిగారు. స్టాల్ ఓనరు ససేమిరా అన్నాడు. చివరకు పదివేల రూపాయలు చెల్లించకతప్పలేదు. ఈ విషయం రక్షక భటుల చెవికి చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్టాల్ ఓనర్‌‌ను విచారించారు.

విదేశీయులను మోసగించినందుకు అతనికి తగిన బుద్ధి చెప్పి, 9,990 రూపాయలు తీసుకున్నారు. ఈ డబ్బును డచ్ వాసులకు అప్పగించారు. పోలీసు అధికారి ఆలోకిత్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఇలా మోసగించడానికి ప్రయత్నిస్తుంటారని అలాంటి వారిపై తాము ఓ కన్నేసి ఉంచుతామని తెలిపారు. కొంతమంది కొనుగోలుదారులు ధరల విషయంగా పట్టించుకోరన్నారు.

ఈ విషయంపై ఆయన మరింతగా వివరిస్తూ.. కొనుగోలుదారులు తమ గొప్పల కోసం ధరల విషయం పెద్దగా పట్టించుకోరు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. రెండేళ్ళ క్రితం రైల్వేమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు చెందిన "చేతక్" అనే పేరుగల గుఱ్ఱం ధర రూ.1,01,000 పలికింది. ఈ సంవత్సరం ఒక వ్యాపారి ఒక గుఱ్ఱానికి మూడు లక్షలు పెడితే, మరోవ్యాపారి ఒక లక్ష డెభ్పై వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడని వివరించాడు.

ఇంతకీ ఈ సంఘటన చోటు చేసుకున్న ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసా? పవిత్ర గంగానది మరియు గండకీ నదుల సంగమ గడ్డపై వుంది.

వెబ్దునియా పై చదవండి