జూన్ వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. యాపిల్ ప్రకటన

శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:54 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో పలు ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుండడంతో తిరిగి కార్యాలయాలు తెరుచుకునే విషయంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ కీలక ప్రకటన చేశారు. 
 
తమ ఉద్యోగులు వచ్చే జూన్‌ వరకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కరోనా మహమ్మారి సంక్షోభ కాలంలో సంస్థ సాధించిన ఫలితాల్ని బట్టి ఆ విధానాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించే విషయం ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
 
అయితే, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేయడంలో ఉన్న సానుకూలతలను కుక్‌ మరోసారి గుర్తుచేశారు. ఎదురెదురుగా కూర్చొని పనిచేసే విధానం కంటే మెరుగైన ప్రత్యామ్నాయమే లేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. సంస్థ వెలుపల ఉండి మంచి ఫలితాల కోసం పనిచేయడం నేర్చుకోగలిగామన్నారు. ఈ సంక్షోభ కాలంలో వచ్చిన మంచి మార్పులను కొనసాగించేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు