సామాజిక నెట్వర్కింగ్ సైట్లు అప్పుడప్పుడు తలకాయ లేని పనులు చేస్తుంటాయన్న సంగతి చాలాసార్లు కనబడుతూ ఉంటుంది. అలాంటిదే ఫేస్ బుక్ ఒకటి చేసేసింది. ఏదో చేయాలనుకుని మరేదో చేసేసింది. ఇంతకీ అది చేసింది ఏంటయా అంటే... తనకున్న యూజర్లలో భారీ సంఖ్యలో యూజర్లు చనిపోయినట్టు నిర్థారించేసింది. శుక్రవారం నాడు వారు చనిపోయినట్లు నిర్థారిస్తూ పోస్టులు చేసింది. విచిత్రం ఏమిటంటే.. ఈ జాబితాలో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ పేరు కూడా ఉండటమే.
ఐతే తాము చేసింది చాలా పెద్ద పొరబాటనీ, సరిదిద్దుకుంటామని ఫేస్ బుక్ యాజమాన్యం యూజర్లను అనునయిస్తోంది. ఏదేమైనా చనిపోయిన వారి స్మారక ప్రొఫైల్స్ను ఇతర ఎకౌంట్లలో పోస్ట్ చేసిన ఫేస్ బుక్ తీరును యూజర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే... మరణవార్త అత్యంత విషాదకరమైనది కదా..!