'జియో బుక్‌' పేరుతో చౌకధరకే రిలయన్స్ ల్యాప్‌టాప్‌లు!? మేలో విడుదల..?

శనివారం, 6 మార్చి 2021 (09:27 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ప్రస్తుతం తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పనుల్లో రిలయన్స్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. 'జియో బుక్‌' పేరుతో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది మే నాటికి జియో బుక్‌లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 
 
ఇకపోతే... సెల్యులార్‌ కనెక్షన్‌తో పనిచేసే ల్యాప్‌టాప్‌ల తయారీపై జియో ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన క్వాల్‌కోమ్‌ టెక్నాలజీస్‌ సీనియర్‌ ప్రొడక్ట్ డైరక్టర్‌ మిగ్యుల్‌ న్యూన్స్ 2018లో తెలిపారు. ఆ తర్వాత సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. 
 
సాధారణ ల్యాపీల్లా విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంతో కాకుండా, గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో ఇవి పని చేస్తుందట. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌లో కొన్ని మార్పులు చేసి ఈ ల్యాపీల్లో వాడనున్నారు. దీనిని జియో ఓఎస్‌ అని పిలుస్తారని సమాచారం. 4జీ ఎల్టీఈ కనెక్షన్‌తో ఇది పనిచేస్తుందని రిపోర్ట్. 
  
ల్యాప్‌టాప్‌ తయారీ ఖర్చులను తగ్గించేందుకుగానూ జియో క్వాల్కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారని మీడియా వార్తలు వస్తున్నాయి. దీనిలో ఇన్‌-బిల్ట్‌ 4జీ ఎల్‌టీఈ మోడెమ్ ఉంటుంది. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5 గిగా హెడ్జ్‌ వైఫై సపోర్ట్‌, బ్లూటూత్‌, 3 యాక్సిస్‌ యాక్సెలెరోమీటర్‌, క్వాల్‌కోమ్‌ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. 
 
అంతే కాకుండా ఈ ల్యాప్‌టాప్‌లో జియో స్టోర్‌, జియో మీట్‌, జియో పేజెస్‌, జియో యాడ్‌ సర్వీసులను ముందుగానే లోడ్‌ చేసి ఉంచుతారని సమాచారం. ఈ ల్యాప్ టాప్ ధరలకు సంబంధించిన వివరాలేమీ ఇంకా తెలియరాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు