జగన్ పై ఆ కేసులు అలానే... షర్మిల పోటీకి దూరం అందుకేనా...?

సోమవారం, 5 మే 2014 (16:16 IST)
WD
ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి బెయిలుపై బయట ఉన్నారు. అలా ఉంటూనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఐతే జగన్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పోస్టులో ఎవరు కూర్చుంటారూ... అనేదానిపై ఇపుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కుటుంబం నుంచి జగన్ మోహన్ రెడ్డి ఒక్కరు మాత్రమే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

వైఎస్ విజయమ్మ విశాఖపట్టణం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుండగా, తన బాబాయి కుమారుడయిన వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇక వైఎస్ షర్మిల మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. కేవలం ప్రచార బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఒకవేళ జగన్ పార్టీ అధికారానికి చేరువయితే సీఎం పోస్టులో జగన్ మోహన్ రెడ్డి కూర్చునేందుకు అడ్డంకులు ఎదురయితే... అంటే మళ్లీ కేసు విచారణ ప్రారంభమయితే జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఒకవేళ అదే జరిగితే వైసీపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నది సందేహంగా మారింది. అందువల్లనే ఎందుకయినా మంచిదని వైఎస్ షర్మిలను ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా పెట్టారనీ, అలాంటి పరిస్థితి ఎదురయితే చెల్లెమ్మను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. చూడాలి... ఏం జరుగుతుందో...?

వెబ్దునియా పై చదవండి