సహజంగా పిల్లలు నిద్రలో పక్క తడుపుతుంటారు. దీంతో వారి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటారు. వారు తమ పిల్లలని కోప్పడుతుంటారు. దీంతో పిల్లలు కూడా మానసికంగా కుంగిపోతుంటారు. కొంతమంది పిల్లలు పక్క తడపటం కొన్ని నెలలపాటు మానేసి తిరిగి మొదలు పెడుతుంటారు. అటువంటి స్థితిని సెకండరీ ఎన్యూరిసిస్ అంటారు. సాధారణంగా ఇలాంటి దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ఉండే అవకాశం ఉంది.
పిల్లలకు ఏ మాత్రం భయం, ఆందోళనలు కలిగినా వెంటనే పక్క తడిపేస్తారు. మానసిక వత్తిడి, భయాల వలన మూత్రకోశపు కండరాలతో సహా శరీరంలోని కండరాలన్నీ అసంకల్పితంగా బిగుసుకుంటాయి. దీనితో పక్కలో మూత్రం పోస్తారు. రాత్రిపూట భయం కలిగించే కథలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలనుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ధనియాల పొడిలో చక్కెర కలిపి రోజుకు రెండుమూడు సార్లు పిల్లలకు తినిపిస్తే వారు పక్క తడిపే అలవాటును మానుకుంటారని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లలు తమ సమస్య గురించి తామే ఆందోళన చెందుతుంటారు కనుక వారికి వారి అలవాటునుంచి బైటపడేందుకు అవకాశాన్ని, సహకారాన్ని ఇవ్వాలి. సమస్యను అర్థం చేసుకుని వారికి ధైర్యాన్నీ, నమ్మకాన్నీ కలిగించాలి. పక్క తడపని రోజును గుర్తించి మెచ్చుకోవాలి.