ఎదిగే పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి.. పోషకపదార్థాలు పుష్కలంగా ఉండాల్సిందే!

శుక్రవారం, 17 జూన్ 2016 (16:25 IST)
ఎదిగే పిల్లల ఆహార విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఆహారం శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి సహకరిస్తుంది. పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. పిల్లల్లో ఎత్తు సమస్యలు లేకుండా ఉండాలంటే.. వారికి తగిన పోషకాహారం అందాలంటే.. తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేమిటో తెలుసుకుందాం...
 
దాదాపు ఐదేళ్లలోపు పిల్లలకు ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి. ఆకలి కాకుండానే అన్నం పెడితే వారు సరిగా తినరు. పిల్లలకు ఏది ఇష్టమో అదే చేసి పెట్టాలి. అప్పుడే ఇష్టంగా తింటారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలు దేన్నీ తినడానికి తొందరగా ఇష్టపడరు. అలాంటి వారికి తగిన సప్లిమెంట్లు ఇప్పించాలి. అప్పుడు వారిలో పోషకాహార లోపం సమస్య పోయి ఆకలి వేయడం, తిండి పట్ల ఆసక్తి రెండూ పెరుగుతాయి.
 
పోషకపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. ఇలా చేస్తే పోషకాహార లోపం రాదు. నట్‌ హల్వా, నువ్వుల లడ్డు, వెన్న పూసిన చపాతీలు, డ్రైఫ్రూట్స్‌, ఎగ్‌ ఆమ్లెట్‌, చపాతీలు, దోసె వంటివి ఈ వయసు పిల్లలకు పెట్టాలి. ఒకేసారి పిల్లలకు ఎక్కువ మోతాదులో అన్నం పెట్టకూడదు. అలా పెడితే వారి కడుపు అరాయించుకోలేదు. 
 
పిల్లలకు అన్నం కలిపి పెట్టొద్దు. వారికి వారే ఆహారం కలుపుకుని తినేట్టు అలవాటు చేయాలి. కుటుంబసభ్యులతో కలిసి అన్నం తినడాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. నలుగురితో కూర్చుని తినడం వల్ల పిల్లలు బాగా తింటారని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి