ఉత్తర బెంగాల్‌కు సింహ ద్వారం మాల్డా

Pavan Kumar

సోమవారం, 26 మే 2008 (19:20 IST)
దక్షిణ బెంగాల్ నుంచి ఉత్తర బెంగాల్‌కు వెళ్లేవారికి మాల్డా సింహద్వారం. మాల్డా ప్రాంతాన్ని గౌర్, పండువా రాజ వంశాలు పాలించారు. వారి తదనంతరం ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని ఇంగ్లీష్ బజార్ పేరుతో పాలించారు. గౌరీ-బంగా ప్రాంతంగా మాల్డాను ఒకప్పుడు పిలిచేవారు. మహానంద నది ఒడ్డున మాల్డా నగరం ఉంది. గంగా, మహానందా, ఫుల్హర్, కాలింద్రి నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహించటం ద్వారా అనేక పంటలతో సస్యశ్యామలమైంది. అలాగే అనేక రాజవంశాలు ఇక్కడ వర్ధిల్లాయి.

మాల్డా పట్టణాన్ని గౌరీపురగా పిలిచేవారని పాణిని వివరించాడు. పండువా రాజ్యాన్ని పుండ్రబర్ధనగా కూడా పిలిచేవారు. బెంగాల్ ప్రాచీన, మధ్యయుగ చరిత్రలో మాల్డాను గౌర్, పండువాగా పిలిచేవారు. మౌర్య సామ్రాజ్యంలో పుంద్రబర్ధన లేక పుండ్ర నగర్‌లు భాగంగా ఉండేది.

మాల్డాకు కొత్త అందాలను కల్పించటంలో బౌద్ధ మత పాలా, హిందూ సేనా వంశంతో పాటుగా ముస్లిం నవాబులు తమ వంతు కృషి చేశారు. చారిత్రకంగా మాల్డాకు ఘన చరిత్రే ఉంది. గంగానది ప్రవహించే ప్రాంతం కావడంతో మాల్డాలో అతి మేలైన ఫాల్జా మామిడి పండ్లు పండుతాయి. వీటి తీపితనం చెప్పేది కాదు.

చూడవలసిన ప్రాంతాలు
గౌర్
బారా సోనా, ఖాదమ్ రసూల్, లత్తన్ మసీదులు గౌర్‌లో ఉన్నాయి. 1425లో నిర్మించిన దాఖిల్ దర్వాజా ఉంది. మాల్డాకు 12 కి.మీ. దూరంలో బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గరలో గౌర్ ఉంది.

పండువా
సికిందర్ షా హయాంలో ముస్లిం వాస్తుకళతో అదీనా మసీదును 1369లో నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద మసీదుల్లో ఇది ఒకటి. దీనిని హిందూ దేవాలయంపై నిర్మించారని అంటారు. దీని పక్కనే అనేక చిన్న మసీదులు కూడా ఉన్నాయి. మాల్డాకు 18 కి.మీ. దూరంలో పండువా ఉంది.

వసతి

ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాలు ఇక్కడ ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి

విమాన మార్గం : కోల్‌కతా సమీపంలో విమానాశ్రయం.

రైలు మార్గం : మాల్డా అతిపెద్ద రైల్వే స్టేషన్. కోల్‌కతా, గౌహతిల నుంచి నేరుగా రైళ్లు ఉన్నాయి.

రహదారి మార్గం : కోల్‌కతా నుంచి 340 కి.మీ.

వెబ్దునియా పై చదవండి