ప్రకృతి ఒడిలో బోటింగ్‌, ట్రెక్కింగ్

గురువారం, 3 ఏప్రియల్ 2008 (18:07 IST)
ఆకాశాన్ని తాకే ఎత్తైన శిఖరాగ్రాలు. ఎటు చూసినా కనుచూపు మేర కొండలు, పచ్చదనం. దీని నడుమ బోట్ రైడింగ్, గుర్రపు స్వారీ... ఊహించుకుంటేనే చాలా బావుంది కదూ. ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. చాలా వరకు మీరు వాటిని చూసే ఉంటారు. అయినా ఎంత చూసినా తనివి తీరని ప్రకృతి సౌందర్యం మనసును లాగుతుంటుంది.

అలాంటిదే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్. ఈ రాష్ట్రంలోని సతారా జిల్లాలో ఉన్న సహ్యాద్రి కొండలలో మహాబలేశ్వర్ కొండలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్వం ఉన్న మహాదేవుని ఆలయ వైభవంతోనే దీనికి ఈ పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. పరమ శివుని పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రదేశం వేసవి తాపాన్నుంచి తప్పించుకోవడానికి చక్కని మార్గమని చెప్పవచ్చు.

మన దేశం బ్రిటీష్ పాలనలో ఉన్న సమయంలో అప్పటి జనరల్ సర్ పీటర్ లాడ్‌విక్ 1824 ఏప్రిల్ నెలలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వేసవి వేడిని తట్టుకునేందుకు ఆయన సతారా జిల్లాలో బసచేసినట్టు స్థానికులు చెబుతుంటారు. లాడ్‌విక్ ఈ కొండలను ట్రెక్కింగ్ ద్వారా అధిరోహించడంతో దీనికి లాడ్‌విక్ పాయింట్ అని పేరు వచ్చింది. క్రమంగా ఇది మహాబలేశ్వర్‌గా వెలుగులోకి వచ్చింది.

దుస్తుల దగ్గర నుంచీ, చెప్పుల వరకు అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. రకరకాల తేనె, జామ్‌లకు మధు సాగర్ పేరొందిన సంస్థ కావడంతో ఇక్కడి నుంచి పర్యాటకులు వీటిని కొనుగోలు చేసుకుని వెళ్తారు. ఈ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండటం చేత అన్ని కాలాల్లోనూ ఇక్కడికి చేరుకోలేము.

జూన్ మధ్య కాలం నుంచి సెప్టెంబర్ మధ్య కాలం వరకు మహాబలేశ్వర్‌ను సందర్శించలేము. వేసవికాలంలో ఏప్రిల్, మే నెలలు మరియు అక్టోబర్, నవంబర్‌ నెలలు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి అనువైన కాలంగా చెప్పవచ్చు.


వెబ్దునియా పై చదవండి